
హైదరాబాద్: కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సుదీర్ఘ పర్యటనకు బయల్దేరింది. తొలుత ఐర్లాండ్ పర్యటన కోసం... ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన కోసం శనివారం టీమిండియా బయల్దేరింది. ఈ సుదీర్ఘ సిరిస్లో భాగంగా కోహ్లీసేన తొలుత జూన్ 27, 29న ఐర్లాండ్తో రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది.
ఇందుకోసం భారత జట్టులోని ఆటగాళ్లు ఐర్లాండ్ పర్యటనకు బయల్దేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. రోహిత్ శర్మ, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కోచ్ రవిశాస్త్రి, జట్టు మేనేజ్మెంట్ సభ్యులు, పలువురి ఆటగాళ్ల ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో పోస్టు చేసింది.
మరోవైపు విమానాశ్రయంలో విరాట్ కోహ్లీతో రాధ అనే ఓ చిన్నారి దిగిన ఫొటోను బీసీసీఐ పంచుకుంది. 'చిన్నారి రాధ టీమిండియా కెప్టెన్తో ఫొటో దిగాలనుకుంది' అని బీసీసీఐ ట్విట్టర్లో కామెంట్ పెట్టింది.
ఐర్లాండ్లో పర్యటన అనంతరం టీమిండియా అటు నుంచి అటే ఇంగ్లాండ్ వెళ్లనుంది. జులై 3 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరిస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వన్డే, టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది.