
సిడ్నీ: భారత నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ లిసా స్టాలేకర్ మండిపడ్డారు. టీమిండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి రెండు వారాల వ్యవధిలో తన అక్క, తల్లిని కోల్పోయి తీవ్ర బాధలో ఉన్నా.. బీసీసీఐ తమకేం పట్టదన్నట్లుగా ఉందన్నారు. వేదాను బీసీసీఐ కనీసం పరామర్శించదా? అని లిసా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 6న వేదా సోదరి వత్సల శివకుమార్ కరోనాతో మృతి చెందారు. అంతకుముందు రెండు వారాల క్రితమే వేద తల్లి కూడా కరోనాతో కన్నుమూశారు.
తన జీవితంలో ఒకేసారి జరిగిన రెండు విషాదాలు వేదా కృష్ణమూర్తిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి. ఈ సందర్భంగా వేదాకి తన తోటి క్రికెటర్లతో పాటు.. పలువురు మాజీ మహిళా క్రికెటర్లు ధైర్యం చెప్పారు. కొందరు ఫోన్లో మాట్లాడి తన భాధను పంచుకున్నారు. ఇందులో ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్, మాజీ ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ లిసా స్టాలేకర్ కూడా ఉన్నారు. ఆమె వేదాని తన ట్విటర్ ద్వారా ఓదార్చారు. అదే సమయంలో బీసీసీఐ తీరుపై మండిపడ్డారు. ఈరోజు ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేసిన జట్టులో వేదాకు చోటు దక్కలేదు. మూడు ఫార్మాట్లలోనూ ఆమెకు నిరాశే ఎదురైంది.
'వేదా తనకిష్టమైన ఇద్దరు వ్యక్తులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉంది. బీసీసీఐ మాత్రం తమకేం పట్టదన్నట్లుగా ఉంది. ఆమె అంత బాధలో ఉంటే కనీసం పరామర్శించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఈ సమయంలోనే బీసీసీఐ ఇంగ్లండ్ టూర్కు జట్టును ఎంపికచేసింది. వేదాని జట్టులోకి తీసుకోలేదు. ఆమె బాధలో ఉందని ఎంపికచేయలేదనే అనుకున్నా.. అలా చేయడం సమంజసం కాదు. టీమిండియా మహిళల జట్టులో వేదాది కీలకస్థానం. ఆమె ఒక సీనియర్. వేదా కాంట్రాక్ట్ ప్లేయర్ అయినప్పటికీ బీసీసీఐ ఎలాంటి కమ్యునికేషన్ జరపలేదు. బీసీసీఐది సరైన పద్దతి కాదు' అని లిసా స్టాలేకర్ అన్నారు.
'నిజమైన అసోసియేషన్ తన ఆటగాళ్ల గురించి లోతుగా శ్రద్ధ వహించాలి. కేవలం ఆటపైనే దృష్టి పెట్టకూడదు. నేను వేద విషయంలో ఎంతో నిరాశ చెందా. ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేన్ అన్ని రకాల సేవలను ఆటగాళ్లకు అందిస్తోంది. భారతదేశంలో ప్లేయర్ అసోసియేషన్ అవసరం ఉందని ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ప్లేయర్స్ ఒత్తిడి, ఆందోళన, భయం మరియు దుఖం అనుభవిస్తున్నారు. ఇది ఆటను ప్రభావితం చేస్తాయి' అని లిసా పేర్కొన్నారు. లిసా 2001 నుంచి 2013 వరకు ఆసీస్ తరపున ప్రాతినిధ్యం వహించారు. వేదా టీమిండియా తరపున 48 వన్డేల్లో 829 పరుగులు.. 76 టీ20ల్లో 875 పరుగులు చేశారు.