గుజరాత్ టైటాన్స్ను వీడిన హార్దిక్ పాండ్య గురించి ఆ జట్టు పేసర్ మహ్మద్ షమి స్పందించాడు. ఇటీవల హార్దిక్ను ముంబయి ఇండియన్స్ ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అతడి కోసం ముంబయి ఫ్రాంచైజీ గుజరాత్కు దాదాపు రూ.100 కోట్లు చెల్లించదని సమాచారం. అయితే ఐపీఎల్లో ముంబయి తరపున అరంగేట్రం చేసిన హార్దిక్.. తిరిగి ముంబయి గూటికి చేరడంపై మిశ్రమ స్పందన వచ్చింది.
కెప్టెన్సీ కోసమే హార్దిక్ గుజరాత్ను వీడాడని కథనాలు వచ్చాయి. మరోవైపు అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్కు సారథి బాధ్యతలు ఇవ్వడంపై ముంబయి ఫ్రాంచైజీపై విమర్శలు వచ్చాయి. అయితే గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ను హార్దిక్ విజయవంతంగా నడిపించాడు. రెండు సార్లు జట్టును ఫైనల్కు చేర్చిన అతడు 2022లో విజేతగా నిలిపాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టీమిండియా పేసర్ మహ్మద్ షమి హార్దిక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

'' జట్టును ఎవరూ విడిచినా మాకేం తీవ్ర ప్రభావం చూపదు. జట్టు సమతూకంగా ఉందా అనే విషయాన్నే చూడాలి. గతంలో హార్దిక్ మాతో ఉన్నాడు. జట్టును నడిపించాడు. గత రెండు సీజన్లలో ఫైనల్కు చేర్చాడు. ఒకసారి విజేతగా కూడా నిలిచాం. కానీ జీవితాంతం హార్దిక్తో గుజరాత్ టైటాన్స్ ఒప్పందం చేసుకోలేదు. గుజరాత్ ఫ్రాంచైజీతో ఉండాలా వద్దా అనేది అతడి నిర్ణయం''
''ఇప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్ బాధ్యతలు అందుకున్నాడు. త్వరలో సారథి అనుభవాన్ని సంపాదిస్తాడు. అయితే అతడు కూడా ఏదో ఒకరోజు గుజరాత్ను వదిలి వెళ్లొచ్చు. ఇదంతా ఆటలో భాగమే. ప్లేయర్లు వస్తుంటారు, వెళ్తుంటారు. కెప్టెన్గా ఎంపికైనప్పుడు తమ ప్రదర్శనతో పాటు సారథి బాధ్యతలు గొప్పగా నిర్వర్తించడం కీలకం. ఇప్పుడు గిల్కు ఆ బాధ్యతలు దక్కాయి. దీంతో అతడి మదిలో కాస్త భారం ఉండొచ్చు. అయితే అతడు ఆందోళన చెందాల్సి అవసరం లేదు. జట్టులో ఉన్న ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకోవాలి'' అని షమి అన్నాడు.
గాయాలతో హార్దిక్ పాండ్య, మహ్మద్ షమి టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులోనూ షమి ఎంపిక కాలేదు. అయితే చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉండేలా షమి ఫిటెనెస్ సాధిస్తున్నాడు. మరోవైపు హార్దిక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వేలంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్ల కోసం రూ.కోట్లు కుమ్మరించింది.
గుజరాత్ కొనుగోళ్లు చేసిన ఆటగాళ్లు: స్పెన్సర్ జాన్సన్ (రూ. 10 కోట్లు), షారుక్ ఖాన్ (రూ. 7.40 కోట్లు), ఉమేశ్ (రూ. 5.80 కోట్లు), రాబిన్ మింజ్ (రూ. 3.60 కోట్లు), సుశాంత్ మిశ్రా (రూ. 2.20 కోట్లు), కార్తీక్ త్యాగి (రూ. 60 లక్షలు), ఒమర్జాయ్ (రూ. 50 లక్షలు), మానవ్ సుతార్ (రూ. 20 లక్షలు)