న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్దోషిగా బయటపడిన భారత మాజీ పేసర్ శ్రీశాంత్ ఆశలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) నీళ్లు చల్లింది. టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకుని, వచ్చే వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆడాలని కోరుకుంటున్న శ్రీశాంత్కు బిసిసిఐ తాజాగా తీసుకున్న నిర్ణయంతో నిరాశే మిగిలేలా కనిపిస్తోంది.
స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడి నిర్దోషులుగా బయటపడిన క్రికెటర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడానికి బిసిసిఐ తాజాగా నిరాకరించింది. 2013లో ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడ్డారంటూ భారత క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలపై బిసిసిఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే.

కాగా, ఇటీవల నిర్దోషులుగా తేలుస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. కాగా, శ్రీశాంత్ని తిరిగి ఆడేందుకు అనుమతించాలని, క్రికెటర్లపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని కేరళ క్రికెట్ అసోసియేషన్.. బిసిసిఐకి విజ్ఞప్తి చేసింది.
అయితే తమ నిర్ణయంలో మార్పులు లేదని బిసిసిఐ మరోసారి తేల్చి చెప్పింది. వారిపై నిషేధం ఎత్తివేయబోమని, వారి విషయంలో మరో ఆలోచన కూడా లేదని బిసిసిఐ స్పష్టం చేసింది. బిసిసిఐ క్రమశిక్షణ సంఘం తీసుకున్న నిషేధ నిర్ణయం అమల్లో ఉంటుందని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపాడు. చట్టపరమైన చర్యలకు, బోర్డు క్రమశిక్షణ చర్యలకు సంబంధం లేదని ఠాకూర్ పేర్కొన్నారు.