హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనను సరిపోల్చడాన్ని మంచిది కాదని పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి కోహ్లీతో పాటు ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్లు ఒకే సమయంలో అరంగేట్రం చేశారు.
అయితే పాక్ అభిమానులు ఉమర్ అక్మల్ను కోహ్లీతో పోలుస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు. కోహ్లీతో తనను పోల్చడాన్ని ఉమర్ అక్మల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. పాక్ అభిమానులతో పాటు, బోర్టు తనపై ఉంచిన అంచనాలను అందుకోవడంలో అక్మల్ విఫమవుతున్నాడు.

దీంతో పాకిస్థాన్ ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా పాక్ మీడియా ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్లను ప్యూచర్ స్టార్లని ప్రశంసలు కురిపిస్తుంటే గ్లోబల్ స్టేజిపై వీరిద్దరూ ఆ ఆంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీతో తనని పోల్చవద్దని అక్మల్ తేల్చి చెప్పాడు.
'కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగుతాడు. దయచేసి నన్ను కోహ్లీతో పోల్చవద్దు. ఎందుకంటే నేను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వస్తాను. ఒకవేళ పాక్ క్రికెట్ ఫ్యాన్స్, క్రీడా విశ్లేషకులు తనను కోహ్లీతో పోల్చాలనుకుంటే ఈ రెండు కండిషన్లు పాటించండి. ఒకటి నాకు లాగే కోహ్లీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం. రెండోది కోహ్లీ లాగానే తనకు వన్ డౌన్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇప్పించడం. ఇంకా చెప్పాలంటే మా జట్టు వన్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్తో కోహ్లీని పోల్చడం సరైన ఆలోచన' అని కీపర్ ఉమర్ అక్మల్ వివరించాడు.
పాక్ తరుపున 116 వన్డేలాడిన అక్మల్ రెండు సెంచరీలు సాధించగా, ఇండియా తరుపున 179 వన్డేలాడిన విరాట్ కోహ్లీ 27 సెంచరీలు చేశాడు. ఇక టెస్టు క్రికెట్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ వరుసగా నాలుగు టస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేశాడు. అక్మల్కు పాక్ క్రికెట్ జట్టులో చోటు దక్కడమే గగనమైపోయింది.