
హైదరాబాద్: దాయాది దేశాల మధ్య కశ్మీర్ అంశంపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పాక్ కోచ్ మిస్బా ఉల్ హక్ చాలా హుందాగా జవాబిచ్చాడు. పాకిస్థాన్ జట్టు హెడ్ కోచ్గా ఛీఫ్ సెలక్టర్గా ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం మిస్బా ఉల్ హక్ని బోర్డు నియమించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సొంతగడ్డపై శ్రీలంకతో పాకిస్థాన్ జట్టు తలపడుతోంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య కరాచీ వేదికగా తొలి వన్డే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది. ఈ వన్డేకి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో మిస్బాకు ఊహించని ప్రశ్న ఎదురైంది.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత ఆటగాళ్లు భారత ఆర్మీ క్యాప్లను ధరించి క్రికెట్ ఆడినట్లుగా.. కశ్మీర్ పరిస్థితులపై పాక్ జట్టు ఎలా స్పందిస్తుందని అడిగాడు. ఈ ప్రశ్నకు మిస్బా కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ మొత్తం విచారం వ్యక్తం చేస్తోందని, ఇక్కడ క్రికెట్కు సంబంధించిన విషయాలపైనే మాట్లాడుకుందామని అన్నాడు.
అయితే మిస్బా రెండు పదవులు చేజిక్కించుకోవడంతో అతని వేతనం భారీ స్థాయిలో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ.. మిస్బా జీతమెంతో తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. మిస్బాకు టీమిండియా కోచ్ రవిశాస్త్రి జీతం సగానికంటే తక్కువగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.
"కోచ్, చీఫ్ సెలెక్టర్గా రెండు పదవులను ఎలా సాధించారని ఒకరు ప్రశ్నించగా.. 'రెండు పదవులు చేజిక్కించుకోవడం వెనుక తానేమీ మాయలు చేయలేదు" అని జవాబు ఇచ్చాడు. "నాకు వచ్చే జీతంపై ఎప్పుడూ ఇంత కావాలని పాక్ బోర్డును అడగలేదు. గత కోచ్కి ఎంత ఇచ్చారో అంతే ఇవ్వమన్నా" అని మిస్బా తెలిపాడు.
అయితే ఏడాదికి రూ.3.4 కోట్ల చొప్పున మూడేళ్ల వరకు మిస్బా జీతంగా తీసుకుంటున్నాడని అక్కడి ఓ న్యూస్ పేర్కొంది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి కన్నా మిస్బా జీతం సగానికంటే తక్కువగా ఉంది. రవిశాస్త్రికి ప్రస్తుతం బీసీసీఐ ఏడాదికి రూ.9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు చెల్లిస్తున్న విషయం తెలిసిందే.