న్యూఢిల్లీ: వన్డే క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా టీమిండియా కెప్టెన్ ధోని నాలుగో స్ధానంలోనే బ్యాటింగ్కు రావాలని వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత క్యాబ్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్కక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ధోని నాలుగో స్ధానంలో ఆడటం మంచి పరిణామమని, తద్వారా విరాట్ కోహ్లీతో కలిసి మ్యాచ్ ఫినిషింగ్ చేసే అవకాశం లభిస్తుందని దాదా పేర్కొన్నాడు. ఇలా చేయడం ద్వారా ప్రస్తుతం కొన్ని ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా ధోని నాలుగులోనే కొనసాగాలని అభిప్రాయపడ్డాడు.

రాబోయే రోజుల్లో కోహ్లీ ఫినిషర్ పాత్రను పోషించాలని పేర్కొన్నాడు. ''ధోనిని నాలుగో స్థానంలోనే ఆడనివ్వాలి. ఫినిషర్ అంటే 40వ ఓవర్లోనే దిగాలని అర్ధం కాదు. కోహ్లి ఫస్ట్డౌన్లో వచ్చి కూడా మ్యాచ్లు ముగిస్తున్నాడు. మ్యాచ్ను ముగించేవాడు లోయర్ ఆర్డర్లోనే రావాలనేది తప్పు పద్ధతి. కోహ్లి అద్భుతమైన ఆటగాడు. మ్యాచ్లను ముగించే బాధ్యతలను కోహ్లీ తీసుకోవాలి'' అని గంగూలీ చెప్పాడు.
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 19 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఇతర మ్యాచ్ల్లో కూడా ధోనీని నాలుగో నంబర్లోనే బరిలోకి దించాలని గంగూలీ పేర్కొన్నాడు.