
ఆదివారం జోధ్పూర్లో ఇండియా క్యాపిటల్స్ వర్సెస్ భిల్వారా కింగ్స్ మధ్య జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్లో యూసుఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్ మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. యూసుఫ్ పఠాన్ను జాన్సన్.. తోసేస్తాడు. ఇక ఫీల్డ్లో అసభ్యకరమైన వాగ్వాదానికి పాల్పడిన నేపథ్యంలో ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్కు లెజెండ్స్ లీగ్ టోర్నీ నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే అతని మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానా కూడా విధించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు టోర్నమెంట్ నిర్వాహకులు క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ రవిశాస్త్రి మిచెల్ జాన్సన్కు తప్పకుండా జరిమానా విధించాల్సిందేనని కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయించారు. ఇండియా క్యాపిటల్స్ తరఫున మిచెల్ జాన్సన్ ఆడుతున్న జాన్సన్ ఇలా ప్లేయర్ మీద దాడికి పాల్పడడం సరికాదని, ఏదైనా ఉంటే అంపైర్లతో చర్చించి ఫిర్యాదు చేయాలని కూడా అతనికి క్రమశిక్షణ కమిటీ హితవు పలికింది. అలాగే అఫీషియల్ వార్నింగ్ కూడా జాన్సన్కు పంపింది.
'లెజెండ్స్ లీగ్ ఒకప్పటి లెజెండరీ క్రికెటర్ల మధ్య పోటీ క్రికెట్ను ప్రోత్సహించడానికి మాత్రమే మేము ఈ టోర్నీ నిర్వహిస్తున్నాం. నిన్నటి క్వాలిఫయర్ మ్యాచ్లో గ్రౌండ్లో జరిగిన విషయం పట్ల చింతిస్తున్నాం. ఆ ఘటన జరగకూడనిది. ఇక ఈ వీడియోను చూశాక.. అలాగే ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడాక.. జాన్సన్ మీద చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ఆటలో స్పూర్తి ప్రధానం. ఇలాంటివి ఈ లీగ్లో మరోసారి పునరావృతం కాబోవని అందరికీ చెబుతున్నా. మంచి నడవడితో లీగ్ నిర్వహన జరుపుతామని ఆశిస్తున్నా' అని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా అన్నారు. భిల్వారా కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో యూసుఫ్ పఠాన్ క్రీజులో ఉండగా.. మిచెల్ జాన్సన్కు పఠాన్కు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు ఒకరినొకరు ఆవేశంతో దగ్గరికి వచ్చారు. సడెన్గా జాన్సన్ యూసుఫ్ పఠాన్ను చేతులతో నెట్టేశాడు. ఇక యూసుఫ్ తిరిగి సీరియస్ అవుతుంటే అంపైర్లు అతన్ని ఆపారు. జాన్సన్ను మరో అంపైర్ దూరంగా తీసుకెళ్లారు. ఇక అప్పటితో ఆ వాగ్వాదం ముగిసింది. అయితే వీరిద్దరి మధ్య గొడవ మాత్రం నెట్టింట హల్ చల్ అయింది.
ఇక యుసుఫ్ పఠాన్ భిల్వారా కింగ్స్ తరఫున చక్కటి ఫామ్ కనబరిచాడు. అతను కేవలం 24 బంతుల్లో 4 సిక్సర్లు, 3 బౌండరీలతో 48పరుగులు చేశాడు. మరోవైపు జాన్సన్ తన 4ఓవర్లలో 51పరుగులిచ్చి కేవలం 2వికెట్లు పడగొట్టాడు. చివరికి బిల్వారా కింగ్స్ 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. జాన్సన్కు పఠాన్ వికెట్ లభించింది. ఇకపోతే ఇండియా క్యాపిటల్స్ తరఫున రాస్ టేలర్ కేవలం 39 బంతుల్లో 84పరుగులు, యాష్లే నర్స్ 28బంతుల్లో 60పరుగులు చేయడంతో భారీ లక్ష్యాన్ని ఇండియా క్యాపిటల్స్ ఛేదించింది. మరో 3బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. తద్వారా ఫైనల్కు చేరుకుంది. 2వ ఫైనలిస్ట్ను నిర్ణయించే చివరి ప్లేఆఫ్స్ మ్యాచ్లో భిల్వారా కింగ్స్, గుజరాత్ జెయింట్స్తో తలపడనుంది.