Vande Bharat express: దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 33 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
ఈ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరతగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ- మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. 2024 ఫిబ్రవరి నాటికి ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.
ఇవే వందే భారత్ రైళ్లను ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ (Legends league cricket tournament) నిర్వాహకులు కూడా వినియోగించుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఈ లీగ్ ట్రోఫీని ఊరేగించనున్నారు. దేశంలో క్రీడారంగాన్ని మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 8వ తేదీన వందే భారత్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ ట్రోఫీ టూర్ ఆరంభం కానుంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ రైలు ట్రావెల్ చేస్తుంది. 15 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుందని లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ రవిశాస్త్రి తెలిపారు. దీనికోసం రైల్వే మంత్రిత్వ శాఖతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు వివరించారు.
ప్రారంభ కార్యక్రమంలో సచిన్ టెండుల్కర్, గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్, ఎస్ శ్రీనాథ్, పార్థివ్ పటేల్, షేన్ వాట్సన్, ప్రవీణ్ కుమార్, ఝులన్ గోస్వామి పాల్గొనే అవకాశం ఉంది. నార్త్, సౌత్, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ రైల్వే జోన్ల మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
ఈ నెల 18వ తేదీ నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మొదలవుతుంది. ఇది రెండవ ఎడిషన్. మొత్తం ఆరు జట్లు- ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయింట్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్, సదరన్ సూపర్ స్టార్స్, భిల్వారా కింగ్స్.. ట్రోఫీ కోసం పోరాడనున్నాయి. డిసెంబర్ 9వ తేదీన ఫైనల్.
స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, ఫ్యాన్కోడ్లో మ్యాచ్లు టెలికాస్ట్ అవుతాయి. ప్రసారం చేయబడుతుంది. రాంచీ, డెహ్రాడూన్, జమ్మూ, విశాఖపట్నం, సూరత్లల్లో మ్యాచ్లు కొనసాగుతాయి. తొలి మ్యాచ్ ఇర్ఫాన్ పఠాన్ నేతృత్వంలోని భిల్వారా కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది.