మరో రెండు నెలల్లో వన్డే వరల్డ్ కప్ మొదలవుతుంది. అన్ని జట్లు ఇప్పటికే తమ టీమ్లను కన్ఫర్మ్ చేసుకొని, ఈ మెగా టోర్నీ కోసం రెడీ అవుతున్నాయి. అదే సమయంలో భారత జట్టు మాత్రం ఇంకా ప్రయోగాల దశలో తడబడుతోంది. కీలకమైన ఆటగాళ్లు గాయాలతో ఎన్సీయేలో కోలుకుంటున్నారు.
ఈ క్రమంలో భారత జట్టు అవకాశాలపై పాక్ మాజీ లెజెండ్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్లోనే ఆస్ట్రేలియాతో తలపడుతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో అక్టోబర్ 8న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో భారత జట్టులో పేసర్ మహమ్మద్ షమీ కీలక ప్లేయర్ అని అక్రమ్ అన్నాడు.

షమీతోపాటు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు ఉన్నా కూడా.. జస్ప్రీత్ బుమ్రా కనుక టీంతో చేరితే భారత్కు చాలా మేలు జరుగుతుందని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. 'ఇండియా దగ్గర మహమ్మద్ షమీ ఉన్నాడు. తను తన బెస్ట్ ఫామ్లో బౌలింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్గా ఉండాలి' అని సూచించాడు.
'ప్రస్తుతం బుమ్రా ఫిట్నెస్ ఎలా ఉందో నాకు తెలీదు. కానీ అతను పిట్గా ఉంటే.. అది జట్టులో చాలా గొప్ప మార్పు తీసుకొస్తుంది. ఇప్పటికే టీమిండియా దగ్గర రవీంద్ర జడేజా, అశ్విన్ రూపంలో అద్భుతమైన ఆల్రౌండర్లు, స్పిన్నర్లు ఉన్నారు. వాళ్లలో ఎవరు ఆడతారో చూడాలి' అన్నాడు. స్వదేశంలో టోర్నీ జరుగుతుంది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుందామని టీమిండియా అనుకోవచ్చని తెలిపాడు.
కానీ అది చాలా డేంజర్ అని అక్రమ్ చెప్పాడు. ఈ సందర్భంగా 2011 వరల్డ్ కప్ గురించి చెప్పిన ఈ పాక్ లెజెండ్.. అప్పుడు భారత్ ఎంత ఒత్తిడి ఎదుర్కుందో గుర్తుచేశాడు. ఇండియా నుంచి కొందరు చాలా మంచి ప్లేయర్లు వచ్చారని, కానీ సొంత మైదానంలో ఆడే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఉంటాయని చెప్పాడు.
'2011లో భారత్ గెలిచింది. కానీ ఆ టోర్నీలో భారత్పై చాలా ఒత్తిడి ఉంది. పాకిస్తాన్ అయినా అంతే. వాళ్లు టోర్నీ హోస్ట్ చేస్తుంటే.. వాళ్లపైనే ఎక్స్ట్రా ప్రెజర్ ఉంటుంది' అని చెప్పాడు. ఇలా ఆతిథ్య దేశంపై ఎప్పుడూ ఒత్తిడి ఎక్కువగానే ఉంటుందని అభిప్రాయపడ్డాడు.