దశాబ్ద కాలంగా ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత మరే ఐసీసీ ట్రోఫీని కూడా టీమిండియా ముద్దాడలేకపోయింది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా భారత జట్టు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ అంజుమ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేసింది.
వచ్చే వన్డే వరల్డ్ కప్లో కూడా ఏ జట్టు బాగా ఆడితే అదే గెలుస్తుందని చోప్రా స్పష్టం చేసింది. 'బాగా పరుగులు చేసి, వికెట్లు తీసుకున్న జట్టే గెలుస్తుంది. అంతకుమించి ఈ టోర్నీలో కూడా ఏం జరగదు. ఈ పని చక్కగా చేసిన టీం, అది ఏ రంగు జెర్సీలో ఉన్నా ట్రోఫీ గెలుస్తుంది' అని ఆమె స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే టీమిండియా ఆటతీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.

'మనం ఒక టీంగా తడబడుతూనే ఉన్నాం. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో బ్యాటర్లు సరైన ఇంపాక్ట్ చూపించడం లేదు. ఇక బౌలింగ్లో అవసరమైన సమయంలో బ్రేక్ త్రూలు లభించడం లేదు. మిగతా ఫార్మాట్లలోనూ అదే సమస్య. టీ20 వరల్డ్ కప్లో, డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండింట్లో ఇది చాలా స్పష్టంగా కనిపించింది' అని అంజుమ్ చోప్రా స్పష్టంగా చెప్పేసింది.
'కానీ మన ఐసీసీ ట్రోఫీల క్యాబినెట్లో చాలా తక్కువ కప్పులే కనిపిస్తాయి. అబ్బాయిలు, అమ్మాయిలు రెండు జట్లు చాలా విషయాల్లో తమ తప్పులు సరిదిద్దుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఐసీసీ ట్రోఫీలు నెగ్గడం అలవాటు చేసుకోవాలి. ఇలా చివరి క్షణంలో తేలిపోవడం మానుకోవాలి. ఐసీసీ ట్రోఫీలు ఓడిపోయే ట్రెండ్ను కంటిన్యూ చేయాలని అనుకోకూడదు' అని ఆమె చెప్పింది.
'భారత జట్టు చాలా కాలంగా ఇదే చేస్తోంది. తొలిసారి 1983లో గెలిస్తే ఆ తర్వాత 2011 వరకు చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచాం. తాజాగా అండర్-19 మహిళల వరల్డ్ కప్ కూడా గెలవడం మంచిదే. కానీ సీనియర్లు కప్పులు గెలిచి చాలా గ్యాప్ వచ్చింది. ఈ ట్రెండ్ సాధ్యమైనంత త్వరగా మారాలని మాజీ ప్లేయర్గా ఆశిస్తున్నా. అబ్బాయిలు కనీసం కప్పు కొట్టారు. అమ్మాయిలు ఇంకా ఒక్క ట్రోఫీ కూడా నెగ్గకపోవడం చాలా బాధాకరం' అని అంజుమ్ అన్నది.