ఇంగ్లండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఘోరంగా ఓడింది. టీమిండియా టాపార్డర్ చాలా దారుణమైన ప్రదర్శన చేసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. దీంతో టీమిండియా ఏ దశలోనూ ఆస్ట్రేలియాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఈ టెస్టు గురించి మర్చిపోయేలోపే మరో ఇంట్రస్టింగ్ లీగ్కు అంతా రెడీ అయింది.
అదే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు గట్టిగా రెడీ అవుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచి జోరు మీదున్న కంగారూలకు బ్రేకులు వేయాలని అనుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ లెజెండ్ మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ను బాగా ఇబ్బంది పెట్టిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ను ఇంగ్లండ్ ప్లేయర్ ఆడుకుంటారని చెప్పాడు.

ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ కనుక ఫిట్గా ఉంటే బోలాండ్కు యాషెస్లో ఆడే అవకాశం దక్కదని నిపుణులు అంటున్నారు. అయితే గాయంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమైన హాజిల్వుడ్.. అప్పుడే పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా? అనేది అనుమానమే. అదే సమయంలో హాజిల్వుడ్ బౌలింగ్లో కొంత పదును కూడా తగ్గిందని మరికొందరు అంటున్నారు.
ఈ క్రమంలో బోలాండ్ కనుక ఆడితే అతనికి ఇంగ్లండ్ బ్యాటర్లు చుక్కలు చూపిస్తారని వాన్ అంటున్నాడు. 'టెస్టుల్లో ఇంగ్లండ్ ఎంచుకున్న బాజ్బాల్ అప్రోచ్ అద్భుతంగా పనిచేస్తోంది. చాలా జట్లకు దీంతో ఇంగ్లండ్ చుక్కలు చూపించింది. కానీ ఈ ఆసీస్ టీం డిఫరెంట్ అని చెప్పాలి. వాళ్ల దగ్గర అద్భుతమైన బౌలింగ్ ఎటాక్ ఉంది. ఇంగ్లండ్ వీళ్లపై కూడా బాజ్బాల్ ఆడేందుకు ప్రయత్నిస్తుంది' అని వాన్ అన్నాడు.
అదే సమయంలో ఇండియాను తెగ ఇబ్బంది పెట్టిన బోలాండ్ బౌలింగ్ను కూడా ప్రస్తావించాడు. బోలాడ్ కనుక ఆడితే.. అతన్ని ఇంగ్లండ్ బౌలర్లు ఒక ఆట ఆడుకుంటారు. స్పిన్నర్లను ముందుకొచ్చి కొట్టినట్లు బోలాండ్ బౌలింగ్లో కూడా ముందుకు దూకి భారీ షాట్లు ఆడటం ఖాయమని వాన్ స్పష్టం చేశాడు.