
టీమిండియాను భారత్లో ఓడించాలంటే జట్టులో ఒకరిద్దరు ఆడితే కుదరదని, అందరూ రాణించాలని ఆస్ట్రేలియాకు మాజీ లెజెండ్ సలహా ఇచ్చాడు. ఆసీస్ దిగ్గజ బౌలర్ మెక్గ్రాత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత్పై గెలిచేందుకు ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్పై ఆధారపడుతోందని, ఇలాగైతే ఆసీస్ గెలవడం కష్టమని మెక్గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే.
'ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు స్మిత్, మార్నస్పై బాగా ఆధారపడుతోంది. ట్రావిస్ హెడ్ కూడా గతేడాది బాగా రాణించాడు. మొత్తం బ్యాటింగ్ లైనప్ నిలబడితేనే పోటీ ఇస్తాం. అసలు స్పిన్ను ఎదుర్కోవడానికి వాళ్ల దగ్గర ఒక గేమ్ ప్లాన్ ఉన్నట్లే కనిపించలేదు. భారత్లో ఎదురయ్యే పరిస్థితుల్లో కాన్ఫిడెంట్గా స్పిన్ ఎలా ఎదుర్కోవాలో వాళ్లకు తెలియడం లేదు. మొదటి టెస్టులో మరీ డిఫెన్సివ్గా ఆడారు. ఇక రెండో టెస్టులో మరీ ఎగ్రెసివ్గా ఆడేందుకు ప్రయత్నించారు. ఈ మ్యాచుల నుంచి ఆసీస్ ఏమైనా నేర్చుకుందేమో చూడాలి' అని మెక్గ్రాత్ చెప్పాడు.

అలాగే ఆస్ట్రేలియాకు భారత లోయర్ ఆర్డర్ కొరకరాని కొయ్యగా మారిందన్నాడు. రెండు టెస్టుల్లోనూ లోయర్ ఆర్డర్లో వచ్చిన అక్షర్, అశ్విన్ ఇద్దరూ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. 'భారత టెయిలెండర్లను క్లీన్ చేయడం ఆసీస్ వల్ల కాలేదు. చివరి ముగ్గురు బ్యాటర్లు 160పైగా పరుగులు చేశారు. వీళ్లే సమస్యలు సృష్టిస్తోంది.
ఇదంతా చూస్తుంటే ఆస్ట్రేలియా సరిగ్గానే బౌలింగ్ మార్పులు చేస్తోందా? అని అనుమానం వస్తోంది. ప్యాట్ కమిన్స్ కొంచెం ముందే వచ్చి టెయిలెండర్లను ఇబ్బంది పెట్టాల్సిందేమో? ఇప్పుడు పరిస్థితిని మార్చాలంటే ఆస్ట్రేలియా చాలా కష్టపడాలి. చివరకు ఈ సిరీస్ను 4-0తో ఓడిపోకుండా వస్తే.. ఆసీస్ గొప్ప పని చేసినట్లే' అని మెక్గ్రాత్ స్పష్టం చేశాడు.