
బౌలింగ్లో బలం లేకనే..
వీటన్నింటి వెనుక కారణం ఏంటి? భారత్ ఎందుకని ఇంతలా స్పిన్ పిచ్లు తయారు చేస్తోంది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ సమాధానం చెప్పాడు. భారత్ వద్ద తమ ఏస్ పేసర్లు లేరని, దీంతో స్పిన్నర్లతో మ్యాచులు గెలిచేందుకే ఇలా చేస్తోందని వివరించాడు. తనకు ఇంతకుమించి వేరే కారణం ఏదీ కనిపించడం లేదని స్పష్టం చేశాడు. 'భారత్లో 20 వికెట్లు తీసుకోవడం అంత ఈజీ కాదు. అది కూడా బుమ్రా, షమీ లేకపోతే అసాధ్యం. వీళ్లు లేకపోవడంతో భారత బౌలింగ్ ఎటాక్ అంత బలంగా కనిపించడం లేదు' అని సన్నీ చెప్పాడు.

వేరే దారి లేక ఈ పిచ్లు..
ఇలా బౌలింగ్ బలహీనంగా ఉండటంతో.. డ్రై పిచ్ అయితే స్పిన్నర్లు ఎలాగోలా 20 వికెట్లు తీసుకునే అవకాశం ఉందని గవాస్కర్ వెల్లడించాడు. ఈ కారణంతోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇలాంటి పిచ్లు తయారు చేస్తున్నారని తెలిపాడు. చాలా రోజుల నుంచి జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో బాధ పడుతున్న అతను.. మరికొన్ని రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్లో కూడా ఆడటం లేదని సమాచారం. అలాగే ఒక వేళ భారత జట్టు కనుక డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా.. ఆ మ్యాచ్లో కూడా బుమ్రా ఆడటం అసాధ్యమని తెలుస్తోంది. ఇక వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా షమీని కూడా మూడో టెస్టులో పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అతను చివరి టెస్టులో ఆడే అవకాశాలు ఉన్నాయట.

స్పిన్నర్ల కోసం ఈ పాట్లు..
'భారత జట్టు కనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే.. స్పిన్ పిచ్లు తయారు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. మన దగ్గర బలమైన బౌలింగ్ యూనిట్ ఉంటే.. వేరేలా ఏమైనా చేసేవారేమో? కానీ ఇప్పుడు మన బలం స్పిన్నర్లే. దీంతో వాళ్లకు అనుకూలంగా ఉండే పిచ్లు తయారు చేస్తున్నాం. బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే ఫ్లాట్ పిచ్లు తయారు చేయడం ప్రస్తుతం పరిస్థితుల్లో కుదరదు. ఇప్పుడు తయారు చేస్తున్న పిచ్లేమో బ్యాటర్ల పట్టుదలకు సవాళ్లు విసురుతున్నాయి' అని గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే నాలుగో టెస్టు జరిగే అహ్మదాబాద్లో తమకు ఎలాంటి పిచ్ కావాలో టీం మేనేజ్మెంట్ చెప్పలేదట. జట్టు మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ లేకపోవడంతో ఎప్పట్లాగే నార్మల్ పిచ్ తయారు చేస్తున్నట్లు అక్కడి క్యురేటర్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications












