హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో ఘనమైన చరిత్ర ఉన్న వెస్టిండీస్ పరువు తీసేలా ప్రస్తుతం టెస్టుల్లో జట్టు ప్రదర్శన ఉందని విండిస్ మాజీ దిగ్గజ పేసర్ కోట్నీ ఆంబ్రోస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్తో ఆదివారం ముగిసిన డే-నైట్ టెస్టులో వెస్టిండిస్ ఇన్నింగ్స్ 209 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఈ డే-నైట్ టెస్టులో వెస్టిండిస్ మూడో రోజు ఏకంగా 19 వికెట్లను చేజార్చుకుంది. దీంతో ఐదు రోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్ మూడు రోజులకే ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 514 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీ చేయగా, కెప్టెన్ రూట్ సెంచరీ చేశాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండిస్ తొలి ఇన్నింగ్స్లో 168 పరుగులకే ఆలౌట్ కాగా, ఆ తర్వాత ఫాలో ఆన్లో భాగంగా ఆడిన రెండో ఇన్నింగ్స్లో 137 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండిస్ రెండు ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ ఒకే హాఫ్ సెంచరీ నమోదవడంపై డెయిల్ మెయిల్కు రాసిన కాలమ్లో ఆంబ్రోస్ పెదవి విరిచాడు.

'మూడు రోజుల టెస్టులో కనీసం ఒక సెషన్లో కూడా విండిస్ క్రికెటర్లు దూకుడుగా ఆడలేదు. ఏ దశలో కూడా ఇంగ్లండ్కి పోటీనివ్వలేకపోయారు. ఇకపై మిగిలిన రెండు టెస్టుల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తారనే నమ్మకం నాకు లేదు. సిరీస్ని ఇంగ్లాండ్కే వదిలేయండి. ఇక మ్యాచ్లు చూడటం వేస్ట్' అని అన్నాడు.
'నేను రెండేళ్ల పాటు విండిస్ జట్టుకి బౌలింగ్ కోచ్గా పనిచేశాను. ఆ సమయంలో విండిస్ ఘనమైన క్రికెట్ చరిత్ర గురించి చెప్పి... వాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాను. మైదానంలోకి దిగాక వారి ఆట మామూలే. ఎందుకంటే.. వాళ్లు వినేందుకు సిద్ధంగా లేరు. ఇప్పుడు వారి తీసికట్టు ప్రదర్శనతో సిగ్గుపడేలా చేస్తోంది' అని ఆంబ్రోస్ వివరించాడు.