క్రికెట్ ఒప్పందాల కారణంగా రాజకీయాల బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ప్లేయర్ గౌతం గంభీర్ ప్రకటించాడు. రాజకీయ బాధ్యతల నుంచి తప్పించమని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థించినట్లు తెలిపాడు. శనివారం ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని గంభీర్ వెల్లడించాడు.
''రాబోయే క్రికెట్ కమిట్మెంట్స్పై దృష్టిసారించడానికి నా రాజకీయ బాధ్యతల నుంచి తప్పించమని గౌరవ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థించాను. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు హృదయపూర్వక ధన్యవాదాలు. జైహింద్'' అని గంభీర్ ట్వీట్ చేశాడు.

లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదుల చేసే తరుణంలో గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి గంభీర్ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. సమీప ప్రత్యర్థిపై 6,95,109 ఓట్లతో గెలుపొందాడు. కరోనా సమయంలో తన ఎంపీ రెండళ్ల జీతాన్ని గంభీర్ విరాళంగా ఇచ్చాడు. తన ఫౌండేషన్తో నియోజకవర్గంలో కొవిడ్-19 టీకా శిబిరాల ఏర్పాటు చేసి సేవలు చేశాడు. 2020 ఢిల్లీ శాసన సభ, 2022 ఢిల్లీ MCD ఎన్నికల్లో గంభీర్ నియోజకవర్గంలో బీజేపీ సత్తాచాటింది.
ఇక క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు గంభీర్ మెంటార్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. మే నెలాఖరు వరకు ఈ మెగా లీగ్ కొనసాగుతుంది. మరోవైపు ఈ సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గంభీర్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని క్రికెట్, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, గంభీర్ సారథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించింది. 2012, 2014లో ఛాంపియన్గా నిలిచింది. అదే మ్యాజిక్ను మెంటార్గా ఈ సీజన్లో రిపీట్ చేయాలని గంభీర్ భావిస్తున్నాడు. గత సీజన్ వరకు గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా బాధ్యతలు నిర్విర్తించాడు.