
హైదరాబాద్: శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న సిరిస్కు మొదట తనను ఎంపిక చేసి ఆ తర్వాత విశ్రాంతినివ్వడంపై యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కారణంగా తన శరీరం కాస్త ఇబ్బంది పెడుతోందని, అందుకే తానే విశ్రాంతి అడిగానని పాండ్యా స్పష్టం చేశాడు.
వంద శాతం ఫిట్గా ఉండి తాను పూర్తి స్థాయిలో ఆడగలనని భావించినప్పుడే బరిలోకి దిగాలనేదే తన ఉద్దేశమని, విశ్రాంతి సమయంలో ఫిట్నెస్పై దృష్టి పెట్టినట్లు పాండ్యా వెల్లడించాడు. వచ్చే ఏడాది జరగనున్న దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని తన ఫిట్నెస్ను మెరుగుపరచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.
'నేను వంద శాతం ఫిట్గా లేనని నా భావన. అందుకే విశ్రాంతి కోరా. ఎక్కువ మ్యాచ్లు ఆడటం వల్ల కాస్త అలసటకు గురయ్యా. పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పుడు క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా. అప్పుడే వందశాతం ప్రదర్శన ఇవ్వొచ్చు. ఇప్పుడు ఈ విరామం లభించడం నిజంగా నా అదృష్టమే' అని పాండ్యా తెలిపాడు.
'ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడానికి జిమ్లో బాగా కసరత్తులు చేయొచ్చు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేయొచ్చు. ఈ పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. నా ఫిట్నెస్ను పూర్తిస్థాయిలో మెరుగు పర్చుకోవడానికే ఈ విశ్రాంతి సమయాన్ని వినియోగించుకుంటున్నా' అని పాండ్యా అన్నాడు.
ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో శిక్షణ తీసుకుంటున్నాడు. జనవరిలో 5న కేప్టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.