హైదరాబాద్: ధర్మశాల, కోల్కతాలలో చేసిన పొరపాట్ల నుంచి తామెంతో నేర్చుకున్నామని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ మీడియాతో మాట్లాడాడు.
'ధర్మశాల, కోల్కతాలో చేసిన పొరపాట్ల ద్వారా మేమెంతో నేర్చుకున్నాం. అలాంటి పిచ్లపై చక్కని ప్రదర్శన చేయాలన్న ఉద్దేశంతోనే మేం ఆడతాం. కొన్ని సార్లు అలా జరగదు. అలాంటి సందర్భంలో వాటి నుంచి మేం నేర్చుకుంటాం. మొహాలి పిచ్ సైతం అలాగే ఉంటుందని భావించాం' అని ధావన్ అన్నాడు.
'మొహాలి పిచ్పై ప్రారంభంలో బంతి సరిగ్గా రాలేదు. ఒత్తిడిని అధిగమించి పది ఓవర్ల తర్వాత ఆట గమనాన్ని మార్చేశాం. నేర్చుకోవడం ద్వారానే మొహాలి పిచ్పై అంత బాగా ఆడగలిగాం' అని ధావన్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ స్థానంలో తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ శర్మపై ధావన్ ప్రశంసలు కురిపించాడు.
'రోహిత్ రెండు మ్యాచ్లకే కెప్టెన్సీ వహించినా చాన్నాళ్లుగా అతని సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. సరదాగా ఉండే అతను మమ్మల్ని కొన్ని నియమాలు పాటించాలని చెప్తాడు. మా అందరికీ మా పాత్రల గురించి తెలుసు. అందుకు తగ్గట్టే ఆడతాం. చివరి మ్యాచ్లో రోహిత్ ఆట అమోఘం. మేమంతా అందుకు సంతోషంగా ఉన్నాం' అని అన్నాడు.
'ఫలితం తేల్చే మ్యాచ్ కావడంతో ఒత్తిడి ఉంటుందని తెలుసు. ముందు మ్యాచ్లో ఓడిపోయిన జట్టు కొత్త ప్రణాళికలతో వస్తుంది. మేం మా సత్తాను, నైపుణ్యాన్ని నమ్ముకున్నాం. అన్ని మ్యాచుల్లాగే దీనిని ఆడతాం. ఇక అందమైన విశాఖ నగరం నాకెంతో ఇష్టం' అని ధావన అన్నాడు.
'గతంలో ఇక్కడ జరిగిన దేవ్ధర్ ట్రోఫీలో పోరాడి మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపికయ్యా. మేం బసచేసిన హోటల్ ముందు సముద్రం ఉంది. ఈ నగరం నా కెరీర్ను మలుపు తిప్పింది. అందుకే విశాఖ నా గమ్యస్థానం అంటాను' అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. కాగా, మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.