2005లో స్టేడియం ప్రారంభమైనప్పుడు ఈ ఆలయం లేదు
మామూలు రోజుల్లో అంత సందడి ఉండదు కానీ మ్యాచులు జరిగే రోజుల్లో ఈ గుడి భక్తులతో కళకళలాడుతుంది. 2005లో స్టేడియం ప్రారంభమైనప్పుడు ఈ ఆలయం లేదు. కానీ ఈ మైదానంలో భారత జట్టుతోపాటు ఐపీఎల్ గత ఫ్రాంచైజీ డెక్కన్ చార్జర్స్కు అసలు విజయాలే దక్కకపోవడంతో.. స్టేడియంలో వాస్తుదోషం ఉందేమోనన్న అనుమానాలు వచ్చాయి.
తొలిసారి దక్షిణాఫ్రికాతో తలపడిన టీమిండియా 5 వికెట్లతో ఓటమి
2005లో స్టేడియంలో తొలిసారి దక్షిణాఫ్రికాతో తలపడిన టీమిండియా 5 వికెట్లతో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2007, 2009లలో ఆస్ట్రేలియా చేతిలోనూ టీమిండియా ఓడిపోయింది. దాంతో వాస్తుదోషం ఉం దన్న అనుమానంతో వినాయకుడి ఆలయం నిర్మించారు. ఈ ఆలయం నిర్మించిన తర్వాత టీమిండియా ఆడిన ఓ మ్యాచ్లోనూ ఓడిపోక పోవడం విశేషం.
హనుమంతు శర్మ మాట్లాడుతూ
ఈ ఆలయంలో పూజారిగా పనిచేస్తోన్న హనుమంతు శర్మ మాట్లాడుతూ "ఈ వినాయకుడి మందిరాన్ని 2011లో నిర్మించారు. భారత జట్టు, ఐపీఎల్లో ఒకప్పటి డెక్కన్ ఛార్జర్స్ ఈ మైదానంలో నిర్వహించే మ్యాచుల్లో విజయం సాధించాలన్నదే గుడి నిర్మాణం వెనకాల ఉన్న ఉద్దేశం. ఇది వాస్తవమే అని రుజువైంది. వినాయకుడిని ప్రతిష్టించిన తర్వాత టీమిండియా ఓడిపోలేదు" అని తెలిపారు.
ధోని గుడి ముందు నిలబడి గణపతి ఆశీర్వాదాలు
"మ్యాచ్లు ఉన్నప్పుడు ప్రాక్టీస్ సెషన్లు పూర్తికాగానే ధోని గుడి ముందు నిలబడి గణపతి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. అలాగే మరో క్రికెటర్ కర్ణ్శర్మ గుడికి వస్తాడు" అని హనుమంతు శర్మ తెలిపారు. ఈ ఆలయం నిర్మించిన తర్వాత 2011, అక్టోబర్ 14న ఇంగ్లాండ్పై టీమిండియా విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
ఆ తర్వాతి నాలుగు మ్యాచ్లలో టీమిండియా విజయం
అలాగే 2010లో న్యూజిలాండ్తో ఈ గ్రౌండ్లో టెస్ట్ను డ్రా చేసుకున్న భారత్.. ఆ తర్వాతి నాలుగు మ్యాచ్లలో విజయాలు సొంతం చేసుకుంది. ఈ వినాయకుడి ఆలయాన్ని గొప్ప క్రికెటర్లు సందర్శిస్తారని హనుమంతు శర్మ అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో విండిస్ ఆడుతున్న తీరు చూస్తే ఈ టెస్ట్లోనూ టీమిండియా విజయం సాధించేలా కనిపిస్తోంది.