
హైదరాబాద్: క్రికెట్లో ప్రమాణాలు మరింతగా పెరగాలంటే క్రికెటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించే దానిపై వారికి శిక్షణ ఇచ్చే కోచ్లపై దృష్టి పెట్టాలని టీమిండియా మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. బుధవారం ముంబైలోని అంధేరీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ 'దేశ్ ప్రేమ్ అజాద్ గురించి ఎవరికీ తెలియదు. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్కు హర్యానాకు ఆడుతున్న సమయంలో శిక్షణ ఇచ్చింది ఆయనే. ఆయనకు మనం ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వం. అలాగే సచిన్లోని ప్రతిభను గుర్తించి మెరుగులు దిద్దింది రమాకాంత్ అచ్రేకర్. అంతేకానీ సచిన్ ప్రాక్టీస్ చేసిన శివాజీ పార్క్ మైదానం కాదు' అని అన్నాడు.
'ఏ ఆటగాడైనా ఏదైనా సాధించాడంటే అది తన కోచ్ వల్లే అని చెబుతాడు. కోచ్ అంటే సోదరుడు, తండ్రి లాంటి వాడు. సచిన్ ఎదిగింది శివాజీ పార్క్ మైదానం వల్ల కాదు. రమాకాంత్ అచ్రేకర్ శిక్షణ వల్ల. నా అంకుల్ నాకు మెంటార్. నాలోని క్రికెట్ ప్రతిభను అతనే గుర్తించాడు. మా తల్లిదండ్రులను ఒప్పించాడు. అలా నేను దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగాను. ఇలాంటి అవకాశం ఎంత మంది పిల్లలకు వస్తుంది చెప్పండి' అని లక్ష్మణ్ అన్నాడు.
'నేను క్రికెట్ అకాడమీలకు వెళినప్పుడు ఎంతో నైపుణ్యం గల కోచ్లను కలుస్తున్నాను. వారిలో ఉన్న మెలకువలు చూసి ఆశ్చర్యపోయాను. ఏ ఒక్క ఆటగాడితో మాట్లాడినా తాను ఈ స్థాయికి చేరడానికి కోచ్ కారణమని చెబుతున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బీసీసీఐకి ఒకటే కోరుతున్నాను. మౌలిక వసతుల కంటే ఎక్కువగా వారికి శిక్షణ ఇస్తున్న కోచ్లపై దృష్టి పెట్టాలి. వారికి సరైన ప్రోత్సాహం అందజేయాలి' అని లక్ష్మణ్ కోరాడు.