
హైదరాబాద్: 44వ పుట్టినరోజుని జరుపుకున్న ఆ మరుసటి రోజే టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ తన ఆటో బయోగ్రఫీ "281 అండ్ బియాండ్" పుస్తకానికి సంబంధించిన కవర్ పేజిని విడుదల చేశాడు.
లక్ష్మణ్ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని వెస్ట్ల్యాండ్ పబ్లికేషన్స్ సంస్థ పబ్లిష్ చేస్తోంది. అంతేకాదు వెస్ట్ల్యాండ్ స్పోర్ట్ ద్వారా ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ప్రఖ్యాత స్పోర్ట్ జర్నలిస్ట్ ఆర్ కౌషిక్ సహ రచయితగా ఈ పుస్తకాన్ని రచించారు.
మోస్ట్ స్టైలిస్ట్ బ్యాట్స్మన్గా పేరుగాంచిన వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టు తరుపున 100కుపైగా టెస్టు మ్యాచ్లాడి 8000లకు పైగా పరుగులు సాధించారు. తన ఆటో బయోగ్రఫీలో వీవీఎస్ లక్ష్మణ్ హైదరాబాద్ జట్టుకు ఆడిన సమయంలో తన క్రికెట్కు అనుభవాలను ఇందులో ప్రస్తావించారు.చాలా ఆత్మ కథల తరహాలో పనిగట్టుకొని వివాదాలు సృష్టించే ప్రయత్నం చేయలేదని వీవీఎస్ చెప్పాడు.
"నా పుస్తకంలో కావాలని చొప్పించిన వివాదాస్పద అంశాలు ఏవీ ఉండవు. అయితే ఇందులో ప్రతీ అక్షరం నిజాయితీగా రాశానని చెప్పగలను. అయితే నాడు స్పందించలేకపోయిన కొన్ని సందర్భాల గురించి మాత్రమే స్పష్టంగా ప్రస్తావించాను. 2000లో ముంబైలో దక్షిణాఫ్రికాతో టెస్టు తర్వాత నన్ను అనూహ్యంగా జట్టు నుంచి తప్పించడం, ఇకపై ఓపెనర్గా ఆడనంటూ కచ్చితంగా చెప్పేసిన విషయం, 2003 ప్రపంచకప్కు ఎంపిక కాకపోవడంపై నేను పడిన వేదనలాంటివి ఇందులో ఉన్నాయి. వివాదం అనే మాటను వాడను కానీ నా మనసులో అనుకున్న విషయాలు మాత్రం నిజాయితీగా వెల్లడిస్తున్నాను" అని లక్ష్మణ్ అన్నారు.
దీంతో పాటు మాజీ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, మహమ్మద్ అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలతో ఉన్న ఫ్రెండ్షిప్తో పాటు తన జీవితంలో మరుపురాని ఇన్నింగ్స్ను నమోదు చేసిన ఈడెన్ గార్డెన్స్ ఇన్నింగ్స్ తన అనుభవాలను ఇందులో పొందుపరిచారు.
కేవలం క్రికెటర్లకే కాకుండా... చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించే విషయంలో తల్లిదండ్రులకు కూడా తన అనుభవాలు ఉపయోగపడతాయని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. వీవీఎస్ లక్ష్మణ్ అనగానే అందరికీ కోల్కతా 281 ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది కాబట్టి దానిని టైటిల్గా పెట్టామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.