ముంబై: ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీ గడువు ముగిసింది. తమ పదవీ కాలం దాటి వారు కొనసాగలేరు అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. గంగూలీ నేతృత్వంలో తొలిసారి గత ఆదివారం బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగింది. ఈ సమావేశంలో జస్టిస్ లోధా కమిటీ సంస్కరణలలో పలు మార్పులు చేశారు.
నా బయోపిక్లో హృతిక్ రోషనే నటించాలి: గంగూలీ
ఏజీఎం సమావేశం అనంతరం దాదా మీడియాతో మాట్లాడుతూ... 'ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగిసింది. ఎక్స్టెన్షన్ ఇచ్చే చాన్స్ లేదు. ఇంతకాలం వారు విధులు చక్కగా నిర్వర్తించారు. సెలక్టర్ల విషయంలో కొత్త విధానం తీసుకువస్తాం. ప్రతి ఏడాది సెలక్టర్లను నియమించడం సరైనది కాదు' అని తెలిపాడు.
ప్రస్తుత సెలెక్టర్ల కాలపరిమితిని ఐదేళ్ల నుంచి నాలుగేళ్లకు తగ్గించేందుకు బీసీసీఐ కొత్త పాలకులు నిర్ణయం తీసుకోనున్నారు. భవిష్యత్తులో సెలెక్టర్ల పదవీకాలాన్ని నాలుగు నుంచి మూడేళ్లకు కుదించనున్నారు. బోర్డు రాజ్యాంగం ప్రకారం.. జాతీయ సెల్టెకర్ల పదవీ కాలాన్ని అప్పటి కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచింది. ఇప్పుడు మళ్లీ పదవీ కాలాన్ని పునరుద్ధరించాలని బీసీసీఐ భావిస్తోంది.
2015లో సెలెక్షన్ కమిటీలో చేరిన ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడా తమ టర్మ్ పూర్తి చేసుకోవడంతో.. ఇక వారు వైదొలగక తప్పదు. అయితే 2016లో సెలెక్షన్ కమిటీలో చేరిన జతిన్ పరాన్జపే, శరణ్దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ మరో ఏడాది తమ పదవుల్లో కొనసాగుతారు. బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్గా ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ నియమితులవుతారని బోర్డు వర్గాలు అంటున్నాయి.
శివరామ కృష్ణన్ భారత్ తరపున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. టెస్టులలో 26 వికెట్లు.. వన్డేలలో 15 వికెట్లు తీసాడు. వెస్టిండీస్ జట్టుపై 28 ఏప్రిల్ 1983లో టెస్ట్ అరంగేట్రం చేసాడు. ఆస్ట్రేలియాపై 2 జనవరి 1986లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. శివరామ కృష్ణన్ లెగ్ బ్రేక్ బౌలింగ్ వేసేవాడు.