
ముంబై: టీమిండియా యువ పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్ సక్సెస్లో భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పాత్ర ఎంతో ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ జట్టుకు భరత్ కోచింగ్ ఇస్తున్నప్పుడు సిరాజ్ ప్రతిభను గుర్తించాడని, అదే జరగకుంటే ఈరోజు మనం అతడిని చూసేవాడిమి కాదన్నాడు. త్వరలోనే సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్లో పెద్ద స్టార్ అవుతాడని శివరామకృష్ణన్ జోస్యం చెప్పాడు. లార్ట్స్ టెస్ట్లో సిరాజ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 8 వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ పేసర్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరోసారి హీరో అయ్యాడు.
తాజాగా లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'మహమ్మద్ సిరాజ్ సక్సెస్లో భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్కు భాగం ఉంది. 1-2 ఏళ్లు హైదరాబాద్కు కోచ్గా ఉన్నప్పుడు అతడే సిరాజ్ను గుర్తించాడు. అతడి ప్రతిభను భారత్ గుర్తించాడు. ఈ యువ పేసర్లో నేర్చుకొనే తపన, విజయవంతం అవ్వాలన్న ఆకలి ఎక్కువే. భరత్ అతడికి ఎంతో విజ్ఞానం అందించాడు' అని తెలిపాడు. భరత్ టీమిండియా కోచ్ అయ్యాక సిరాజ్ నిత్యం అతడికి కాల్ చేసేవాడు. నన్ను ఎప్పుడు జట్టులోకి తీసుకుంటారని అడిగేవాడట. ఈ విషయాన్ని గతంలో భరత్ స్వయంగా వెల్లడించాడు.
'నిజం చెప్పాలంటే మొహమ్మద్ సిరాజ్ కేవలం భరత్ను అనుసరించాడంతే. కొంతమంది కోచ్ మాటలను అనుమానిస్తారు. కోచ్ చెప్పింది సరైందేనా? పని జరుగుతుందా? అని సందేహిస్తారు. సిరాజ్ మాత్రం అలాకాదు. భరత్ను గురువుగా భావించాడు. అతడు చెప్పిన ప్రతిదీ చేశాడు. ఈ విషయం భరత్ కచ్చితంగా రవిశాస్త్రికి చెప్పే ఉంటాడు' అని లక్ష్మణ్ శివరామకృష్ణన్ పేర్కొన్నాడు. స్వల్ప కాలంలోనే సిరాజ్ భారత క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. మొదట్లో భావోద్వేగం, సరిగ్గా ప్రణాళికలు అమలు చేయకపోవడంతో వెనకబడ్డాడు. ఎప్పుడైతే ఆస్ట్రేలియా సిరీసులో అదరగొట్టాడో అతడి ఆట మరో స్థాయికి వెళ్లిపోయింది.
లార్ట్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్కు భాగ్యనగర వాసులు బ్రహ్మరథం పట్టారు. భారీ కటౌట్లను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు హైదరాబాద్ అభిమానులు. మూడు అంతస్తుల ఎత్తులో రోడ్డు మధ్యలో సిరాజ్ కటౌట్లను అమర్చారు. పాత బస్తీలో పెద్దఎత్తున కటౌట్లను ఏర్పాటు చేశారు. వికెట్ తీసిన ప్రతీసారి సిరాజ్ తన నోటిపై వేలును అడ్డంపెట్టి ఏం మాట్లాడొద్దు అన్నట్లుగా సైగలు చేస్తూ వినూత్నరీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ సంబరాలకు సంబందించిన
కటౌట్లే హల్చల్ చేస్తున్నాయి. సిరాజ్ ఇంటిపక్కనవారు, సన్నిహితులు, స్నేహితులు కలిసి పలుచోట్ల సందడి చేశారు. మహ్మద్ సిరాజ్.. హైదరాబాద్ రజనీకాంత్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
రెండో టెస్ట్ మ్యాచ్ ద్వారా మహ్మద్ సిరాజ్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. సిరాజ్ లార్డ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ టెస్టులో ఒక టీమిండియా బౌలర్ ఇన్ని వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1982లో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ ఫీట్ను సాధించాడు. కపిల్ 168 పరుగులిచ్చి 8 వికెట్లు తీయగా.. సిరాజ్ 126 పరుగులకే 8 వికెట్లు పడగొట్టడం విశేషం. కపిల్ తొలి ఇన్నింగ్స్లో ఐదు.. రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసి ఓవరాల్గా 8 వికెట్లు సాధించాడు. ఇక లార్డ్స్ టెస్టులో భారత్ తరుపున అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్గా కూడా సిరాజ్ నిలిచాడు.