ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ అవతరించిన సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీ తుది పోరులో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి విజయాన్ని అందుకున్నారు. ఈ ఫైనల్ పోరు ప్రదర్శన, విజయం అనంతరం మన ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లోనూ దూసుకొచ్చారు.
బ్యాటర్ల ర్యాంకింగ్స్..
ఫైనల్ మ్యాచ్ లో 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ బాది జట్టు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడతడు 756 పాయింట్లతో రెండు స్థానాలను మెరుగుపరుచుకుని టాప్-3లోకి దూసుకొచ్చాడు. శుభ్మన్ గిల్ 784 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ 770 పాయింట్లో రెండో ర్యాంకులో ఉండగా.. ఫైనల్ లో నిరాశపరిచిన విరాట్ కోహ్లీ 736 పాయింట్లతో ఒక్క ర్యాంక్ కిందకి పడిపోయాడు. నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్ మ్యాచ్ తో పాటు మిగతా మ్యాచుల్లోనూ కీలకంగా రాణించిన కేఎల్ రాహుల్ 638 పాయింట్లతో అనూహ్యంగా కిందకి దిగజారిపోయాడు. ప్రస్తుతం 16వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
బౌలర్లు, ఆల్ రౌండర్లు...
బౌలర్ల విభాగంలో టీమిండియా చైనామన్ కుల్దీప్ యాదవ్ 650 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ 680 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 657 పాయింట్లతో ఏకంగా ఆరు స్థానాలు ముందుకెళ్లి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. రవీంద్ర జడేజా 616 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి పదో ర్యాంకుకు చేరాడు. ఆల్రౌండర్ల జాబితాలోనూ రవీంద్ర జడేజా టాప్ -10లో కొనసాగుతున్నాడు. 220 పాయింట్లతో పదో ర్యాంకులో నిలిచాడు. అఫ్గాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు.
