భారత టీ20 క్రికెట్లో సూర్య శకం మొదలైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో పొట్టి ఫార్మాట్ జట్టు బాధ్యతలను విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అందుకున్నాడు. జులై 27 నుంచి ప్రారంభంకానున్న శ్రీలంక పర్యటనతో తన యాక్షన్ మొదలుపెట్టనున్నాడు. గతంలో రోహిత్, హార్దిక్ పాండ్య గైర్హాజరీలో సూర్య తాత్కాలికంగా సారథి బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ సారి పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టనున్నాడు.
మొన్నటివరకు రోహిత్ తర్వాత హార్దిక్ పాండ్యనే భారత కెప్టెన్ అవుతాడని భావించారంతా. కానీ నయా కోచ్గా గౌతమ్ గంభీర్ రాక, హార్దిక్ ఫిట్నెస్ సమస్యలతో అంచనాలు తలకిందులయ్యాయి. ఆలస్యంగా 30 ఏళ్ల వయసులో భారత క్రికెట్లో అడుగుపెట్టిన సూర్య మూడేళ్లలోనే టీ20 జట్టు సారథిగా ఎంపికవ్వడం విశేషం.

అయితే భారత టీ20 జట్టు కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న అంనతరం సూర్య సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన అనుభూతిని పంచుకున్నాడు. గత కొన్ని వారాలు అంతా తనకి కలలా అనిపిస్తుందని అన్నాడు. ఇదంతా భగవంతుని అనుగ్రహం అంటూ పేర్కొన్నాడు. ''నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు, మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్ని వారాలుగా అంతా కలలా అనిపిస్తుంది. దేశం తరఫున ఆడటం ఎంతో గొప్ప అనుభూతి. దాన్ని మాటల్లో వర్ణించలేను''
''ఇక కొత్త బాధ్యత దాంతో పాటు బాధ్యత, మరింత ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. మీ మద్దతు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. కీర్తి అంతా భగవంతునికి చేరుతుంది. గాడ్ ఈజ్ గ్రేట్'' అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. కాగా, టీ20ల్లో ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ సూర్య గతంలో కూడా భారత్కు కెప్టెన్సీ వహించాడు. రోహిత్, హార్దిక్ గైర్హాజరీలో వన్డే వరల్డ్ కప్ అనంతరం టీ20 జట్టును నడిపించాడు. గతేడాది నవంబరులో సూర్య సారథ్యంతో భారత్ ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ను 4-1తో గెలుచుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్ను 1-1తో డ్రాగా ముగించింది.