ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-12లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ముంబై స్టార్ బౌలర్ లసిత్ మలింగ స్వదేశానికి బయలుదేరనున్నాడు. బుధవారమే మలింగ శ్రీలంకకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటికే రెండు ఓటములతో సతమవుతున్న ముంబై జట్టు మరింత బలహీనపడనుంది.
స్వదేశానికి మలింగ:
మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నెల 23లోగా అన్ని క్రికెట్ జట్లు తమ జట్లను ప్రకటించాలి. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసేందుకు.. ఏప్రిల్ 4న ప్రారంభమయ్యే శ్రీలంక దేశవాళీ వన్డే టోర్నీ సూపర్ ప్రొవిన్షియల్ లో లంక ఆటగాళ్లు ఆడనున్నారు. ఈ వన్డే టోర్నీలో ఆడేందుకు ఆదేశ క్రికెట్ బోర్డు మలింగను స్వదేశానికి పిలిపించింది. మలింగ బుధవారమే స్వదేశానికి వెళ్లనున్నాడు.
అనుమతి.. ఇంతలోనే:
మలింగ ప్రస్తుత ఐపీఎల్ సీజన్కు పూర్తిస్థాయిలో ఆడేందుకు లంక బోర్డు ఇటీవలే అనుమతించింది. ఇంతలోనే దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు బుధవారమే మలింగ స్వదేశానికి తిరిగి రానున్నాడని లంక చీఫ్ సెలక్టర్ అశాంత ప్రకటించాడు. ఈ టోర్నీ ఏప్రిల్ 4 నుంచి 11 వరకు జరగనుంది. ఇందులో 4 జట్లు పాల్గొంటున్నాయి. మలింగ గాలె జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఈ టోర్నీ అనంతరం మళ్లీ ముంబై జట్టులో కలుస్తాడో లేదో వివరాలు మాత్రం తెలియరాలేదు.