|
మలింగ ఔట్:
ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ లసిత్ మలింగ ఐపీఎల్ 2020 నుండి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో రాబోయే సీజన్కు శ్రీలంక స్టార్ పేసర్ మలింగ అందుబాటులో ఉండడని ముంబై ఇండియన్స్ బుధవారం స్పష్టం చేసింది. మలింగ స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ముంబై ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఏదేమైనా ఐపీఎల్ 2020కి మలింగ అందుబాటులో లేకపోవడం ముంబై జట్టుకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. గతేడాది జరిగిన ఫైనల్లో చివరి ఓవర్లో యార్కర్ కింగ్ మాలింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైకి ఊహించని విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.
కుటుంబంతో ఉండాలని:
'వ్యక్తిగత కారణాలతో లసిత్ మలింగ ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్నాడు. సీజన్ మొత్తానికి అతడు అందుబాటులో ఉండడు. శ్రీలంకలో తన కుటుంబంతో ఉండాలని మలింగ అభ్యర్థించాడు. మేం మాట్లాడలేకపోయాం. మలింగ స్థానంలో జేమ్స్ ప్యాటిన్సన్ జట్టులోకి వస్తాడు. ఈవారం రోజుల్లో అతడు అబుదాబిలో ఉన్న జట్టుతో కలుస్తాడు' అని ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ మలింగ. 122 ఐపీఎల్ మ్యాచ్ల్లో 19.80 సగటుతో 170 వికెట్లు తీశాడు.
39 టీ20 మ్యాచ్ల్లో 47 వికెట్లు:
ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ప్యాటిన్సన్ను గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఐపీఎల్ ప్లేయర్ వేలంలో ఏ ప్రాంచైజీ కొనుగోలుచేయలేదు. ప్యాటిన్సన్ కనీస ధర రూ .1 కోట్లు. కాగా లసిత్ మలింగ ఐపీఎల్ 2020 నుంచి తప్పుకోవడంతో అతన్ని ముంబై తీసుకుంది. ప్యాటిన్సన్ తన కెరీర్లో ఇప్పటివరకు 39 టీ20 మ్యాచ్ల్లో 47 వికెట్లు తీశాడు. అతనికి కొంతకాలంగా ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కట్లేదు. ఆసీస్ తరఫున 2015 సెప్టెంబర్లో జరిగిన వన్డేలో ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో ప్యాటిన్సన్ ఇప్పటివరకు 21 టెస్టుల్లో, 15 వన్డేల్లో, 4 టీ20 మ్యాచ్ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
రిచర్డ్సన్ కూడా ఔట్:
తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ కేన్ రిచర్డ్సన్ కూడా ఐపీఎల్ 2020 నుండి తప్పుకున్నాడు. తన భార్య త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో కేన్ ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఆసీస్ పేసర్ రిచర్డ్సన్ స్థానంలో ఆ దేశానికే చెందిన స్టార్ లెగ్స్పిన్నర్ ఆడమ్ జంపాను జట్టులోకి తీసుకున్నట్లు ఆర్సీబీ ప్రాంచైజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.