హైదరాబాద్: అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడి క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించినందుకు శ్రీలంక పేసర్ లసిత్ మలింగపై ఏడాది పాటు శ్రీలంక క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. అయితే శిక్షను ఆరు నెలల పాటు సస్పెన్షన్లో ఉంచింది. దీంతో పాటు తదుపరి వన్డే మ్యాచ్ ఫీజులో మలింగ 50 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.
మంగళవారం శ్రీలంక బోర్డు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ ముందుకు హాజరైన మలింగ తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు కోరాడు. దీంతో కమిటీ మలింగ సస్పెన్షన్ను ఆరు నెలలకు తగ్గించింది. ఈ ఆరు నెలల కాలంలో మళ్లీ ఇలాంటి సంఘటనలకు పాల్పడితే మిగతా ఆరు నెలలు నిషేధం అమల్లోకి వస్తుంది. దీంతో పాటు మలింగ ఆడే తదుపరి వన్డే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు.

ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. బోర్డు సీఈఓ అనుమతి లేకుండా మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్న నిబంధనను ఉల్లంఘించి మలింగ రెండుసార్లు క్రీడల మంత్రిపై విమర్శలపై విమర్శలు చేశాడు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ చేరడంలో విఫలమైన శ్రీలంక జట్టుపై ఆ దేశ క్రీడామంత్రి దయసిరి జయశేఖర తీవ్ర విమర్శలు చేశారు.
శ్రీలంక ఆటగాళ్లకు సరైన ఫిట్నెస్ లేదని, పొట్టలు పెంచుకొని చాలా లావుగా తయారయ్యారని ఆ కారణంగానే మైదానంలో చాలా క్యాచ్లను నేలపాలు చేశారని ఆరోపించారు. ఇలా ఉంటే క్రికెట్ ఎలా ఆడతారని ఆయన అన్నారు. కాగా, పాకిస్థాన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక మూడు క్యాచ్లను నేలపాలు చేసింది.
దీనికి మలింగ స్పందించాడు. మంత్రిని కోతితో పోల్చాడు. క్రికెట్ గురించి మంత్రి మాట్లాడడంపై వ్యంగ్యంగా మాట్లాడాడు. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ కమిటీ వేసింది. విచారణ సందర్భంగా మలింగ మంత్రికి క్షమాపణ చెప్పాడు.