
హైదరాబాద్: టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో శ్రీలంక జట్టు కనీసం పోరాడకుండా ఓటిమిపాలవడంపై ఆ జట్టు కెప్టెన్ లసిత్ మలింగ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోవడం, భారీ భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోవడం వల్లనే ఈ సిరిస్ ఓటమికి ప్రధాన కారణాలుగా మలింగ చెప్పుకొచ్చాడు.
ఈ సిరిస్లో తన వ్యక్తిగత ప్రదర్శనను సైతం మలింగ విమర్శించుకున్నాడు. మూడో టీ20 అనంతరం మలింగ మాట్లాడుతూ "2-0తో సిరిస్ చేజార్చుకున్నాం. నేను మంచి ప్రదర్శన చేయాల్సింది. ఎందుకంటే నాకు చాలా అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉంది. కానీ, ఈ టోర్నమెంట్లో ఒక వికెట్ కూడా తీయలేకపోయా. అందుకే మేము ఈ పరిస్థితిలో ఉన్నాం" అని అన్నాడు.
"నేను జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడిని. అవును, నేను వికెట్ తీసుకునే బౌలర్ అయినప్పటికీ వికెట్లు తీయాలనే ఒత్తిడి నాపై ఉంది. మ్యాచ్లో విజయం సాధించాలంటే తొలి ఆరు ఓవర్లలోనే ఒకటి లేదా రెండు వికెట్లు పడగొట్టాలి. మా విషయంలో ఈ టోర్నమెంట్లో అది జరగలేదు" అని మలింగ ఆవేదన వ్యక్తం చేశాడు.
"టీ20ల్లో భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఒకవైపు భారత ఆటగాళ్లు మెరుగైన భాగస్వామ్యాలు సాధిస్తే, తమ జట్టు మాత్రం విఫలమైంది. టీ20ల్లో ప్రతీ బంతి విలువైనదేనని, కనీసం ప్రతీ బంతికి సింగిల్ అయినా తీయాలి. వారు షాట్లు కొడుతూ ఇన్నింగ్స్ను నడిపించిన తీరు అద్భుతం. గత ఏడాదిన్నర నుంచి తమ ప్రదర్శన మెరుగపడిన దాఖలాలు లేవు" అని మలింగ చెప్పుకొచ్చాడు.
"గతంలో శ్రీలంక అంటే పటిష్టంగా ఉండేది. కుమార సంగక్కర, మహేలా జయవర్ధననే, దిల్షాన్లు ఇన్నింగ్స్లు నిర్మించి లంక విజయాల్లో కీలక పాత్ర పోషించే వారు. ప్రస్తుతం తమ జట్టులో అది కొరవడిందనే విషయం ఒప్పుకోవాలి. తమ జట్టులో ఉన్న ఆటగాళ్లు యువ క్రికెటర్లే కాకుండా టాలెంట్ కూడా ఉంది. కాకపోతే పరిస్థితులన్ని బట్టి ఆడటంలో వారు విఫలమవుతున్నారు" అని మలింగ తెలిపాడు.