
హైదరాబాద్: కుశాల్ పెరీరా అద్భుతంగా ఆడి మా నుంచి గేమ్ను లాగేసుకున్నాడని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ముక్కోణపు టీ20 సిరిస్లో భాగంగా మంగళవారం ఆతిథ్య శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక శిఖర్ ధావన్ 49 బంతుల్లో 90 పరుగులు సాధించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మరో 9 బంతుల మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.
కుశాల్ పెరీరా 37 బంతుల్లో 4 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం ధావన్ మాట్లాడుతూ 'మొదటి ఆరు ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా అద్భుతంగా ఆడి మా నుంచి గేమ్ను లాగేసుకున్నాడు' అని అన్నాడు.
'పవర్ ప్లేలో రెండు వికెట్లకు 40 పరుగులు మాత్రమే చేయగలిగాం. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో తిరిగి కోలుకుని పరుగులు రాబట్టగలిగాం. పెరీరా పవర్ ప్లే ఓవర్లో 27 పరుగలు రాబట్టాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి లంక 75 పరుగులు చేసింది. పవర్ ప్లేలో వచ్చిన పరుగులే ఇక్కడ లంక విజయంలో కీలకపాత్ర పోషించాయి' అని ధావన్ అన్నాడు.
ఆరంభంలో వికెట్లు కోల్పోవడంతో కూడా జట్టుపై ఒత్తిడి పెంచిందని ధావన్ పేర్కొన్నాడు. 'ఆరంభంలో మొదటి రెండు ఓవర్లలో లంక రెండు వికెట్లు తీసి మాపై ఒత్తిడి పెంచింది. ఆదిలోనే వికెట్లు కోల్పోడంతో మిగతా ఆటగాళ్లు దూకుడుగా ఆడలేకపోయారు. వికెట్లు కోల్పోకుండా ఉంటే కాస్త దూకుడుగా ఆడేవాళ్లు' అని పేర్కొన్నాడు.
'పవర్ ప్లేలో ముగిసే సరికి మేము 10 పరుగుల వెనుకబడ్డాం. అయినా సరే నేను యథావిధిగా మొదటి నుంచి దూకుడుగానే ఆడాను. 174 పరుగులు మంచి స్కోరే అయినప్పటికీ కుశాల్ పెరీరా అద్భుతంగా ఆడి మా నుంచి గేమ్ను లాక్కున్నాడు' అని ధావన్ వివరించాడు. ముక్కోణపు టీ20 సిరిస్లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య గురువారం రెండో మ్యాచ్ జరగనుంది.