
హైదరాబాద్: భారత మాజీ బ్యాట్స్మన్ లాల్చంద్ రాజ్పుత్ జింబాబ్వే ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. ప్రస్తుతం జింబాబ్వేకు తాత్కాలిక కోచ్గా ఉన్న రాజ్పుత్ను పూర్తి స్థాయి ప్రధాన కోచ్గా నియమిస్తున్నట్టు జింబాబ్వే క్రికెట్ బోర్డు ట్విట్టర్లో పేర్కొంది.
వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్కు జింబాబ్వే జట్టు అర్హత సాధించకపోవడంతో కోచ్గా ఉన్న హీత్స్ట్రీక్ను తప్పించి రాజ్పుత్ను తాత్కాలిక కోచ్గా జింబాబ్వే బోర్డు నియమించిన సంగతి తెలిసిందే. 56 ఏళ్ల రాజ్పుత్ ఇప్పుడు జింబాబ్వేకు పూర్తిస్థాయి కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
ఈ మేరకు మూడేళ్ల కాలానికి రాజ్పుత్ను కోచ్గా నియమించినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. "రాజ్పుత్ సేవలు జింబాబ్వే జట్టు వినియోగించుకోనుంది. అతని అనుభవం, కష్టపడేతత్వం, ఆటపై ఉన్న మక్కువ మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది" అంటూ ట్వీట్లో పేర్కొంది.
ఇక కోచ్గా నియమిచండం పట్ల రాజ్పుత్ ఆనందం వ్యక్తం చేశారు. "కోచ్గా నియమించింనందుకు జింబాబ్వే క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. కోచ్గా ఎంపికైనందుకు ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. దీన్ని గౌరవంగా, ఛాలెంజ్గా తీసుకుంటున్నా. జట్టును మరో లెవల్కు తీసుకవెళ్లడానికి కృషి చేస్తాను. త్వరలోనే జింబాబ్వే ఆటలో మార్పులు చూస్తారు" అని రాజ్పుత్ పేర్కొన్నారు.
2007లో దక్షిణాఫ్రిలో జరిగిన టీ20 వరల్డ్కప్ను గెలుచుకున్న టీమిండియాకు రాజ్పుత్ టీమ్ మేనేజర్గా వ్యవహరించారు. గతంలో ఆయన అప్ఘనిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్గా కూడా పనిచేశారు. భారత్ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడిన 56 ఏళ్ల రాజ్పుత్ రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.