
విరామం తీసుకుంటే నైపుణ్యాలు మారవు:
గత నెలలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనింగ్ క్యాంప్ విషయాలను బుధవారం ఇన్స్టాగ్రామ్ చాట్లో లక్ష్మీపతి బాలాజీ పంచుకున్నాడు. 'ఎంఎస్ ధోనీ ఆరు నెలలు విశ్రాంతి తీసుకున్నాడని మనం చర్చలు పెట్టకూడదు. అది అసలు పెద్ద విషయమే కాదు. టైగర్ వుడ్స్, రోజర్ ఫెదరర్ లాంటి వారు చాలా మేజర్ టోర్నీలకు దూరమైనా.. మళ్లీ ఆడారు. విరామం తీసుకుంటే ఆటకు వీడ్కోలు పలికినట్టు కాదు. నైపుణ్యాలు ఏం మారవు. ధోనీ కూడా అంతే' అని చెన్నై బౌలింగ్ కోచ్ చెప్పాడు.

ఎలాంటి తడబాటు లేదు:
'ఇప్పటికే తానెంటే నిరూపించుకున్న వారి సత్తా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 25, 26 ఏళ్ల వయస్సులో లాగా ఇప్పుడు ధోనీ ఉండకపోవచ్చు. కానీ.. ఆటలో మానసికంగా అతడు ఇంకా అత్యుత్తమంగా మారాడు. ఇటీవల ముగిసిన చెన్నై ట్రైనింగ్ క్యాంప్లో ధోనీ ఆటను చూసా. అసలు ఎక్కువ కాలం బ్రేక్ తీసుకున్నట్టే కనిపించలేదు. మొదటి రోజు శిక్షణలోనూ అతడితో ఎలాంటి తడబాటు లేదు. అదే మహీ గొప్పతనం' అని బాలాజీ పేర్కొన్నాడు.

సెలక్టర్లదే నిర్ణయం:
'టీ20 ప్రపంచకప్లో ధోనీని ఆడించాలో వద్దో అనే నిర్ణయం పూర్తిగా సెలక్టర్లదే. నేను ఎప్పుడైనా ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్లకు ధోనీని ఎంపిక చేస్తా. అతని కెప్టెన్సీ, ఫినిషింగ్ నైపుణ్యాలు కచ్చితంగా జట్టుకు ఉపయోగపడుతాయి. వేసవిలో ఐపీఎల్ ఆడటం మనకు అలవాటు. గతంలో ఛాంపియన్స్ లీగ్ సెప్టెంబర్- అక్టోబర్లో జరిగేది. ఈ సంవత్సరం ఐపీఎల్ ఆ సమయంలో జరిగినా.. పిచ్లలో పెద్దగా మార్పులు ఉండవు' అని చెన్నై కోచ్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ ఫామ్ను బట్టి అంచనా వేయడం సరికాదు:
'ఐపీఎల్ ఫామ్ను బట్టి ధోనీని అంచనా వేయడం సరికాదు. అతడు గొప్ప బ్యాట్స్మన్. ప్రస్తుతం చాలా ఫిట్గా ఉన్నాడు. అందుకే ఐపీఎల్ ఆడాలనుకుంటున్నాడు, కెప్టెన్సీ చేయాలనుకుంటున్నాడు. అందుబాటులోనే ఉన్నానని చెప్పాలనుకుంటున్నాడు. మానసికంగా ధోనీ విజయం సాధిస్తూనే ఉన్నాడు. అలాగే ఒత్తిడిలో మ్యాచ్ను ఎలా గెలిపించాలో కూడా అతడికి తెలుసు' అని భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ అన్నాడు.


Click it and Unblock the Notifications












