దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ 62 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్ 13వ సీజన్లో తొలి శతకం నమోదైంది. మొత్తంగా రాహుల్ 69 బంతుల్లో 14ఫోర్లు, 7సిక్సర్లతో 132 పరుగులు చేశాడు. రాహుల్ 'వన్ మ్యాన్ షో' ప్రదర్శన చేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 206 రన్స్ చేసి.. బెంగళూరు ముందు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బెంగళూరు బౌలర్ శివమ్ దూబే రెండు వికెట్లు తీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టుకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ (26) బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మొదటగా ఆచితూచి ఆడారు. ఓపెనింగ్ జోడీ సింగిల్స్ తీస్తూ స్కోర్ను ముందుకు నడిపించారు. ఆరు ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఆ తరువాతి ఓవర్లో మయాంక్ (26) పెవిలియన్ చేరాడు. నికోలస్ పూరన్ అండతో రాహుల్ వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే 36 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేశాడు.
14వ ఓవర్ మొదటి బంతికి పూరన్ (17) ఔట్ అయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆపై గ్లెన్ మాక్స్వెల్ (5) నిరాశపరిచాడు. అయితే మరో ఎండ్లో ఉన్న మాత్రం రాహుల్ తన ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్మురేపాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 62 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు. దీంతో రాహుల్ ఐపీఎల్ కెరీర్లో రెండో శతకం సాధించాడు.
మార్క్ చేరుకున్నాక రాహుల్ గేర్ మార్చాడు. డేల్ స్టెయిన్ వేసిన 19వ ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది ఏకంగా 26 రన్స్ పిండుకున్నాడు. ఇక దూబే వేసిన 20వ ఓవర్లో కరుణ్ నాయర్ (15) ఒక ఫోర్ బాదగా.. రాహుల్ వరుసగా ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాది 23 రన్స్ రాబట్టారు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు రాహుల్ క్రీజులో ఉండి 'వన్ మ్యాన్ షో' చేశాడు. బెంగళూరు బౌలర్లలో శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టగా.. యుజువేంద్ర చహల్ ఒక వికెట్ తీశాడు.