అబుదాబి: కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 రన్స్ చేసి.. పంజాబ్ ముందు 192 పరుగుల లక్ష్యంను ఉంచింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (70; 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు) అర్ధ శతకం సాధించాడు. ఇన్నింగ్స్ చివరలో విండీస్ హిట్టర్ కీరన్ పోలార్డ్ (47; 20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హ్యాట్రిక్ ఫోర్లు, సిక్సులతో వీరవిహారం చేశాడు. 19వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాధగా.. 20వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సులు బాది ముంబైకి భారీ స్కోర్ అందించాడు. హార్దిక్ పాండ్యా కూడా 11 బంతుల్లో 30 రన్స్ చేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఆరంభం లభించలేదు. మొదటి ఓవర్లోనే పేసర్ షెల్డన్ కాట్రెల్ సూపర్ బౌలింగ్తో షాక్ ఇచ్చాడు. ఐదో బంతికి ఓపెనర్ క్వింటన్ డికా క్(0)ను బౌల్డ్ చేశాడు. దీంతో ముంబై కనీసం పరుగులు ఖాతా తెరవకుండానే వికెట్ చేజార్చుకుంది. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన నాలుగో ఓవర్లో కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (10) రనౌటయ్యాడు. ఐదో బంతిని రోహిత్ వికెట్ల వెనకకు షాట్ ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. మమ్మద్ షమీ విసిరిన డైరెక్ట్ త్రోకు సూర్యకుమార్ పెవిలియన్ చేరాడు.
రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో రోహిత్ శర్మ ఒంటరిపోరాటం చేస్తూ జట్టును ఆదుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుండి నడిపించాడు. అతనికి ఇషాన్ కిషన్ మంచి సహకారం అందించాడు. రోహిత్, ఇషాన్ 50కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని స్పిన్నర్ కృష్ణప్ప గౌతం విడదీశాడు. 14వ ఓవర్ మొదటి బంతికి కిషన్.. కరుణ్ నాయర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆపై రోహిత్ 40 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్ధ శతకం పూర్తి చేశాడు. జేమ్స్ నీషమ్ వేసిన 16వ ఓవర్ రెండో బంతికి ఫోర్ కొట్టి 50 మార్క్ చేరుకున్నాడు. ఆ ఓవర్లోనే హిట్మ్యాన్ వరుసగా 4,4,6,6 బాది 22 పరుగులు రాబట్టాడు.
షమీ వేసిన 17వ ఓవర్ తొలి బంతికే రోహిత్ శర్మ పెవిలియన్ చేరడంతో స్కోరు వేగం కాస్త తగ్గింది. బౌండరీ లైన్ వద్ద మ్యాక్సీ అద్భుత క్యాచ్ పట్టాడు. జేమ్స్ నీషమ్ వేసిన 18వ ఓవర్లో హార్దిక్ పాండ్య సిక్స్, రెండు ఫోర్లు బాదడంతో 18 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత షమీ వేసిన 19వ ఓవర్లో పాండ్య ఒక ఫోర్ బాదగా.. పొలార్డ్ మూడు వరుస బౌండరీలు బాది 19 పరుగులు రాబట్టారు. ఇక గౌతం వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రెండో బంతికి పాండ్యా సిక్స్ కొట్టాడు.. ఆఖరి మూడు బంతుల్లో పొలార్డ్ వరుసగా సిక్సర్లు బాదిజట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఐదో వికెట్కు ఈ జోడీ 23 బంతుల్లో 67 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. పంజాబ్ బౌలర్లలో కాట్రెల్, షమీ, గౌతం తలో వికెట్ తీశారు.
KXIP vs MI: ఐపీఎల్లో రోహిత్ అరుదైన రికార్డు.. కోహ్లీ, రైనా సరసన హిట్మ్యాన్!!