
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2019 సీజన్కు ఆయా ఫ్రాంఛైజీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. ఐపీఎల్ 2019 కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 18న జైపూర్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. వేలానికి ముందే అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన ఫ్రాంఛైజీలు ఇక జట్టు సపోర్టింగ్ స్టాఫ్ని నియమించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.
వచ్చే ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టు సహాయ సిబ్బందిలో బ్రెట్ హరొప్(ఫిజియో), శ్రీధరన్ శ్రీరాం(బ్యాటింగ్ కోచ్), ప్రసన్న రామన్(హై పెర్ఫార్మెన్స్ కోచ్) కొనసాగనున్నారు. మైక్ హెసన్ను హెడ్ కోచ్గా నియమిస్తూ గత నవంబర్లోనే పంజాబ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో జూనియర్ సెలక్షన్ ప్యానెల్లో ఛీఫ్ సెలక్టర్గా ఉన్న వెంకటేశ్ ప్రసాద్ ఆ పదవికి రాజీనామా చేసి పంజాబ్ జట్టులో చేరిన సంగతి తెలిసిందే.
రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి అటు బీసీసీఐలోనూ, ఇటూ ఐపీఎల్లోనూ ఒకేసారి విధులు నిర్వర్తించకూడదు. అందుకే బీసీసీఐలో జూనియర్ సెలక్షన్ ఛీఫ్ సెలక్టర్గా ఉన్న వెంకటేశ్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశాడు. కేవలం ఒక్క సీజన్కు మాత్రమే బౌలింగ్ కోచ్గా పంజాబ్ జట్టుకు పనిచేశాడు. పంజాబ్ జట్టుకు సెహ్వాగ్ మెంటార్గా ఉన్న సమయంలో వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు స్వీకరించాడు.
ఇక, ఒకే రోజుతో ముగిసిపోయే ఐపీఎల్ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో 50 మంది భారత క్రికెటర్లు కాగా 20 మంది విదేశీయులు. ఈ వేలంలో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 145.25 కోట్లు అందుబాటులో ఉన్నాయి.