ఇండోర్: అన్ని ఫార్మాట్లలో టీమిండియా ఎంతో పటిష్ఠమైన జట్టు. ప్రపంచ క్రికెట్లో టాప్ ర్యాంకింగ్స్లో ఉంది. అలాంటి జట్టుపై గెలవాలంటే సీనియర్లు బాధ్యత తీసుకోవాలి అని శ్రీలంక బ్యాట్స్మన్ కుశాల్ పెరీరా పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ మంగళవారం రాత్రి 7 గంటలకు ఇండోర్లో జరగనుంది. గువాహటిలో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో రెండో మ్యాచ్లో విజయం సాధించి ఈ ఏడాదిని విజయంతో ఆరంబించాలని భారత్-శ్రీలంక జట్లు చూస్తున్నాయి.
ఇంతటి సునాయాస క్యాచ్ను చిన్న పిల్లాడు కూడా వదిలేయడు (వీడియో)!!
రెండో టీ20 సందర్భంగా కుశాల్ పెరీరా మీడియాతో మాట్లాడాడు. 'టీమిండియా ఎంతో పటిష్ఠమైన జట్టు. ప్రపంచ క్రికెట్లో టాప్ ర్యాంకింగ్స్లో ఉంది. అలాంటి జట్టుపై పోరాడాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. టీమిండియాపై గెలవాలంటే సమష్టిగా పోరాడాలి. జట్టులోని సీనియర్లు బాధ్యతలను తీసుకోవాలి. అప్పుడే విజయాలు సాధించగలం' అని పెరీరా అన్నాడు.
'శ్రీలంక జట్టులో యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి మంచి ప్రతిభ ఉంది. నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం. టీ20 ప్రపంచకప్కు ఇప్పటినుండే సిద్ధంగా ఉండాలి. టెస్టుల్లో నిలకడగా రాణించేలేకపోయాను. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫర్వాలేదనిపించా. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో మంచి ప్రదర్శన చేశా. కానీ.. నా మార్క్ను అందుకోలేకపోయా. భారత్ సిరీస్లో అందుకోవడానికి ప్రయత్నిస్తా' అని పెరీరా చెప్పుకొచ్చాడు.
'ఈ సిరీస్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్నా. ఈ సిరీస్ మంచి అనుభవాన్ని ఇస్తుందని ఆశిస్తున్నా. ఉత్తమ ప్రదర్శన చేసి జట్టుకి విజయాన్ని అందించడానికి ప్రయత్నిస్తా. ఈ ఏడాది బాగా పరుగులు చేయాలనుకుంటున్నా' అని 29 ఏళ్ల లెఫ్ట్ హాండెర్ పెరీరా తెలిపాడు. లంక తరఫున పెరీరా 18 టెస్టులు, 98 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. టెస్టులలో 934, వన్డేలలో 2739, టీ20లలో 1171 పరుగులు చేసాడు.
ఎక్కువ మంది యువ, అనుభవం లేని ఆటగాళ్లతోనే ఉన్న శ్రీలంక జట్టు భారత్తో పోలిస్తే బలహీనంగానే కనిపిస్తోంది. ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా మినహా మిగతా బ్యాట్స్మెన్ టీమిండియాను ఎక్కువగా ఎదుర్కొన్నది లేదు. అవిష్క ఫెర్నాండో, గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, రాజపక్సలపైనే బ్యాటింగ్ భారం ఉంది. అయితే లంక బౌలింగ్ మాత్రం పర్వాలేదు. మలింగ, షనక, ఉదాన, హసరంగలతో పటిష్టంగానే ఉంది.