
హోబర్ట్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12 దశ రసవత్తరంగా ఆరంభమైంది. ఈ మలివిడతలో కూడా సంచలన విజయాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తమ ప్రత్యర్థులను మట్టి కరిపించాయి. ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్పై ఇంగ్లాండ్ ఘన విజయాలను అందుకున్నాయి. ఫైనల్స్ దిశగా తొలి అడుగు వేశాయి. ఈ రెండు జట్లు కూడా ప్రత్యర్థులను ఓడించిన తీరు హైలైట్గా నిలిచింది. మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేయడం ఆకట్టుకుంది.
తాజాగా ఇదే జాబితాలో శ్రీలంక కూడా చేరింది. సూపర్ 12లో తన తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను చిత్తు చేసింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బౌలింగ్లో, అనంతరం బ్యాటింగ్లో సత్తా చాటిందీ జట్టు. వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ కుశాల్ మెండిస్ ఈ మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు. అర్ధసెంచరీని నమోదు చేశాడు. జట్టు మొత్తం సమష్టిగా రాణించడంతో ఐర్లాండ్పై ఆడుతూ పాడుతూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్- నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఓపెనర్ పాల్ స్ట్రింగ్, టాప్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ టాప్ స్కోరర్స్. శ్రీలంక బౌలింగ్ మేజిక్కు ఎదురొడ్డి నిలిచిన పాల్ స్ట్రింగ్స్ 25 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్తో 34, హ్యారీ టెక్టర్ 42 బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 45 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించకపోవడంతో 128 పరుగుల వద్దే నిలిచిందా జట్టు స్కోర్.
శ్రీలంక బౌలర్లు సమష్టిగా రాణించారు. బౌలర్లందరూ వికెట్లు పడగొట్టారు. వనిందు హసరంగ, మహీష్ తీక్షణ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నారు. బినుర ఫెర్నాండో, లహిరు కుమార, చమిక కరుణరత్నె, ధనంజయ డిసిల్వా ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. లక్ష్యాన్ని ఛేదించడానికి పెద్దగా చెమటోడ్చలేదు. 15 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టపోయి 133 పరుగులు చసింది. ఆడుతూ పాడుతూ గెలుపు దిశగా సాగింది.
ఓపెనర్ ధనంజయ డిసిల్వా- 31 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్-68, టాప్ ఆర్డర్ బ్యాటర్- చరిత్ అసలంక-31 పరుగులతో నాటౌట్గా నిలిచారు. వీరిద్దరు స్టేడియంలో పరుగుల వరద పారించారు. కుశాల్ మెండిస్ 43బంతుల్లో మూడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 68 పరుగులు చేశాడు.