న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భారత టెస్టు క్రికెట్ కెప్టెన్, ప్రముఖ బౌలర్ అనిల్ కుంబ్లే నిర్ణయించుకున్నారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన వెంటనే అయన తన రిటైర్ మెంట్ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. ఫీల్డింగ్ సందర్భంగా మూడో టెస్టులో అతను శుక్రవారంనాడు గాయపడ్డాడు. వరుసగా గాయాల బారిన పడుతుండడంతో తాను రిటైర్ కావాలని కుంబ్లే నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే విధంగా గత కొంతకాలంగా అతను ఫామ్ లో లేరు.
గత 18 ఏళ్లుగా ఆయన అంతర్జాతీయ క్రికెట్ లో తన సత్తా చాటారు. 132 టెస్టులు ,271 వన్డేల్లో ఆడారు. టెస్టుల్లో ఆయన 619 వికెట్లు తీసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో 600 వికెట్ల మైలురాయి దాటిన బౌలర్లలో కుంబ్లే మూడో వాడు. ఒకే ఇన్నింగ్సులో పది వికెట్లు తీసిన రెండో బౌలరుగా అతను ఖ్యాతి దక్కించుకున్నాడు. బ్యాటింగులో కూడా అతను తన ప్రతిభ చాటాడు. టెస్టుల్లో ఒక సెంచరీతో పాటు ఐదు అర్థ సెంచరీలు చేశాడు. 1990లో ఇంగ్లాండుపై మాంచెస్టర్ లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీరును ఆయన ప్రారంభించాడు.