
ముంబై: భారత గడ్డపై ఏప్రిల్ 9న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగనుంది. ఐపీఎల్ 14 సీజన్ ఆరంభానికి మరో వారం రోజులే ఉండడంతో ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. రాజస్తాన్ రాయల్స్ నూతన డైరెక్టర్ కమ్ కోచ్ కుమార సంగక్కర కూడా జట్టు సాధనను పర్యవేక్షిస్తున్నాడు. నూతన సీజన్కు రాజస్తాన్ ఏ విధంగా సిద్ధమవుతుందనేది సంగక్కర యూట్యూబ్ చానెల్లో చెప్పుకొచ్చాడు.
అయితే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు కుమార సంగక్కర ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీని వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ వేలంలో పరిగణలోకి తీసుకుంటారా?' అని సంగక్కరను ఒక అభిమాని ప్రశ్నించాడు. 'నువ్వు మాట్లాడేది మెస్సీ గురించేనా?. ఫుట్బాల్లో దిగ్గజంగా పేరుపొందిన మెస్సీలో మంచి టాలెంట్ ఉంది. మెస్సీలో క్రికెట్ ఆడే లక్షణాలు కూడా ఉన్నాయి. అవకాశం ఉంటే మెస్సీని వచ్చే ఏడాది వేలంలో తప్పకుండా తీసుకుంటాం' అని సంగా బదులిచ్చాడు.
'ఐపీఎల్ 2021కు నూతనోత్సాహంతో బరిలోకి దిగుతున్నాం. బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తున్నా.. జోఫ్రా ఆర్చర్ దూరమవ్వడం కాస్త నిరాశపరిచింది' అని కుమార సంగక్కర పేర్కొన్నాడు. ఐపీఎల్ 2020లో రాజస్తాన్ రాయల్స్ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. మొదటలో వరుస విజయాలు అందుకుని.. ఆపై పరాజయాల బాట పట్టింది. స్మిత్ సారధ్యంలోని రాయల్స్ మొత్తం 14 మ్యాచ్ల్లో 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
టోర్నీ ఆరంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్కు భారీ షాక్ తగిలింది. శస్త్రచికిత్స జరిగినందున రాజస్థాన్ స్టార్ పేసర్ ఐపీఎల్ 2021కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2018 నుంచి రాజస్థాన్ టీమ్కి ఆర్చర్ ఆడుతున్నాడు. ఆ ఏడాది 15 వికెట్లు పడగొట్టిన ఆర్చర్.. 2019లో 11 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ ఐపీఎల్ 2021 సీజన్లో అసాధారణరీతిలో ఆర్చర్ రాణించాడు. 14 మ్యాచ్లాడి 20 వికెట్లు తీశాడు. ఫస్ట్ పవర్ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీయగలిగే ఆర్చర్.. స్లాగ్ ఓవర్లలోనూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేయగలడు. ఈ నేపథ్యంలో ఆర్చర్ లేకపోతే రాజస్థాన్ బౌలింగ్ విభాగం బలహీనపడనుంది.