
కోహ్లీ-రోహిత్ బెస్ట్ జోడీ:
'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్పెషల్ క్రికెటర్లు. ఇద్దరిలో ఎంతో టాలెంట్ ఉంది. అయితే మునుపటితో పోలిస్తే.. వన్డే క్రికెట్లో రూల్స్ మారాయి. కాబట్టి పరుగులు సాధించడం సులువవుతోంది. కానీ భారత క్రికెట్ని ఈ స్థాయికి తీసుకురావడానికి కోహ్లీ, రోహిత్ జోడీ చాలా శ్రమించింది. ప్రస్తుత క్రికెట్లో అత్యుత్తమ జోడీ అంటే.. రోహిత్-కోహ్లీ జంటే' అని కుమార సంగక్కర అన్నాడు.

కోహ్లీ, రోహిత్లను గౌరవించాలి:
'గతంలో రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ చాలా అందంగా షాట్స్ ఆడేవారు. టెక్నికల్గానూ వాళ్లు చాలా మెరుగ్గా ఉండేవారు. ఇప్పుడు అదే తరహాలో కోహ్లీ-రోహిత్ జోడీ ఉంది. ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తోంది అని సంగక్కర పేర్కొన్నాడు. పాత తరం ఆటగాళ్లకు నిలకడగా మూడు ఫార్మాట్లలో ఆడాల్సిన అవసరం లేకపోయిందని, ఆ కోణంలో చూసినా కోహ్లీ, రోహిత్లను గౌరవించాలని చెప్పాడు.

వన్డే ప్రపంచకప్లో ఐదు సెంచరీలు:
2019 వన్డే ప్రపంచకప్లో ఐదు సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ.. 2019కి గానూ ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకున్నాడు. రోహిత్ భారత్ తరఫున 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20లు ఆడాడు. టీ20ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాదాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20లు ఆడాడు. వన్డే, టెస్టులతో పాటు టీ20ల్లోనూ నిలకడగా రాణిస్తూ.. ఇప్పటికే 70 సెంచరీలను నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 శతకాల రికార్డ్ని బ్రేక్ చేయగల సామర్థ్యం ఉన్న ఏకైక క్రికెటర్ కోహ్లీనే.

మ్యాచ్లు జరిగితే చూసేందుకు వింతగా ఉంటుంది:
క్రికెట్ పునఃప్రారంభానికి ఐసీసీ నిర్దేశించిన మార్గదర్శకాలతో మ్యాచ్లు జరిగితే చూసేందుకు చాలా వింతగా ఉంటుందని ఎంసీసీ అధ్యక్షుడు కుమార సంగక్కర అన్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్గదర్శకాలను పాటించడం కన్నా అత్యుత్తమ మార్గం లేదన్నాడు. 'కొత్త మార్గదర్శకాలతో క్రికెట్ జరిగితే కాస్త వింతగా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా బరిలోకి దిగేందుకు ఆటగాళ్లకు మరింత ఆత్మవిశ్వాసం కావాలి' అని సంగక్కర అన్నాడు.


Click it and Unblock the Notifications












