హైదరాబాద్: మరో మూడు నెలల్లో తన 40వ పుట్టినరోజుని జరుపుకోనున్నాడు శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి రెండు సంవత్సరాలైన తన బ్యాటింగ్లో ఇంకా సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడు.
తాజాగా ఇంగ్లాండ్ దేశీయ టీ20 టోర్నీలో సుర్రే-మిడిల్ సెక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సంగక్కర అద్భుత ప్రదర్శన చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు చేసిన కుమార సంగక్కర ఓ సిక్స్తో అభిమాని ఫోన్ పగల గొట్టాడు. స్టీవెన్ ఫిన్ ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన బంతిని సంగక్కర డీప్ కవర్ మీదగా భారీ షాట్తో సిక్స్గా మలిచాడు.
ఈ బంతిని అందుకోవడానికి ఆతృత చూపిన ఓ అభిమాని చేతిలో ఫోన్తో క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. దీంతో బంతి మొబైల్కు తగిలి కింద పడిపోయింది. వెంటనే ఫోన్ అందుకున్న ఆ అభిమాని పగిలిపోయిన ఫోన్ని పక్కన కూర్చున్న అభిమానులకు చూపిస్తూ ఆశ్ఛర్యం వ్యక్తం చేశాడు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2015లో టెస్టు క్రికెట్కు కుమార సంగక్కర వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత సంగక్కర సర్రే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
కాగా సంగక్కర శ్రీలంక గెలిచిన 2014 టీ20 వరల్డ్ కప్, 2007 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరిన జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. కుమార సంగక్కర నేతృత్వంలోని శ్రీలంక జట్టు 2011 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్కు చేరింది. శ్రీలంక తరుపున 134 టెస్టుల్లో 57.40 యావరేజితో 12,400 పరుగులు చేశాడు.