
ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఎంతో మంది యువ ప్లేయర్లు ఐపీఎల్లో సత్తా చాటి జాతీయ జట్టుతో పాటు తదితర మంచి అవకాశాలు అందుకున్నారు. ఉదాహరణకు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి మేటి ప్లేయర్లు తొలుత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి వెలుగులోకి వచ్చిన వారే. తాజా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్లో చాలా మంది యువ ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. నిన్నటి మ్యాచ్లో మరో యువ కెరటం ముంబై ఇండియన్స్ జట్టు ద్వారా వెలుగులోకి వచ్చాడు. అతనే కుమార్ కార్తికేయ. శనివారం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో కుమార్ కార్తికేయ ముంబై తరఫున అరంగేట్రం చేశాడు.
ఈ 24ఏళ్ల మధ్యప్రదేశ్ జట్టు ప్లేయర్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్ తీసి ముంబైకి మంచి బ్రేక్ ఇచ్చాడు. అంతకుముందు శాంసన్.. హృతిక్ షోకీన్ బౌలింగ్లో లాంగ్-ఆఫ్, లాంగ్-ఆన్లో రెండు సిక్సర్లు కొట్టి ప్రమాదకరంగా మారుతున్న టైంలో తన ఊరించే బంతితో కార్తికేయ.. శాంసన్ను క్యాచ్ ఔట్ చేశాడు. తన తొలి ఓవర్లోనే వికెట్ తీశాడు. తన నాలుగు ఓవర్లలో 1/19ప్రదర్శనతో చాలా పొదుపుగా బౌలింగ్ చేసి రాజస్థాన్ రాయల్స్కు స్కోరు రాకుండా అడ్డుకున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్కు చెందిన కార్తికేయ ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ విరామ టైంలో మాట్లాడుతూ.. తానొక మిస్టరీ బౌలర్ అని పేర్కొన్నాడు. ఇక లైఫ్లో ఏదైనా సాధించేదాకా తన ప్రయాణాన్ని ఆపేది లేదని పేర్కొన్న అతను తొమ్మిదేళ్లుగా ఇంట్లో లేనని తెలిపాడు. 'మా అమ్మ, నాన్న నాకు తరచుగా ఫోన్ చేసి వచ్చి కొన్ని రోజులు ఉండిపోవచ్చు కాదరా అని బతిమాలినా.. నేను వెళ్లకపోయేవాణ్ని. ఇప్పుడు నేను ఐపీఎల్లో ఆడాను. ఇదొక గొప్ప అచీవ్ మెంట్. ఇప్పుడు చాలా గర్వంగా ఇంటికి వెళ్తాను.' అని పేర్కొన్నాడు. 'నా కోచ్ సంజయ్ సర్ నా పేరును లిస్ట్ ఏ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టు కోసం సూచించారు. నా పేరు అండర్-23 జట్టులో స్టాండ్బై ప్లేయర్గా వచ్చినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను.' అని తన ఐపీఎల్కు ముందు నాటి క్రికెట్ ప్రస్థానాన్ని పేర్కొన్నాడు.
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో కార్తికేయ తొమ్మిది డాట్ డెలివరీలు వేశాడు. కేవలం ఒక్క బౌండరీ మాత్రమే ఇచ్చాడు. 'ఇక ప్లేయింగ్ 11లో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు కొంత టెన్షన్ పడ్డా. కానీ నేను ప్రతి బ్యాటర్ కోసం రాత్రిపూట నా ప్లాన్స్ నేను వేసుకున్నా. అలా శాంసన్కు ప్యాడ్లపై బౌల్ చేయడానికి ప్రయత్నించా వర్కౌట్ అయింది' అని పేర్కొన్నాడు. ఇక షోకీన్, కార్తికేయ బౌలింగ్ బాగా చేశారని కెప్టెన్ రోహిత్ సైతం ప్రశంసించాడు.