జొహానెస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్ను 1-1తో సౌతాఫ్రికాతో కలిసి అందుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఆఖరి టీ20లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అయిదు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ అరుదైన రికార్డు సాధించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్ (41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. కుల్దీప్ యాదవ్(5/17) ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది.

అయితే కుల్దీప్ యాదవ్ తన బర్త్ డే రోజు అయిదు వికెట్లు పడగొట్టడం విశేషం. తమ పుట్టినరోజు జరిగిన టీ20 మ్యాచ్ల్లో అయిదు వికెట్లు పడగొట్టిన తొలి క్రికెటర్గా కుల్దీప్ చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్లో బర్త్డే రోజు అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో కుల్దీప్ తర్వాత శ్రీలంక ప్లేయర్ హసరంగ రెండో స్థానంలో ఉన్నాడు. హసరంగ తన స్పెషల్ డేలో నాలుగు వికెట్ల సాధించాడు.
కాగా, పుట్టినరోజున భారత్ తరపున ఇప్పటివరకు ముగ్గురు బౌలర్లు బరిలోకి దిగారు. కుల్దీప్ కంటే ముందు యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా ఆడారు. ఈ స్పెషల్ డేస్ లో యువీ శ్రీలంకపై 2009లో మూడు వికెట్లతో సత్తాచాటితే.. 2020లో వెస్టిండీస్పై జడేజా ఒక్క వికెట్ పడగొట్టారు. అయితే ఈ ముగ్గరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లే కావడం విశేషం.
ఇక పరుగుల తేడాతో భారత్ సాధించిన విజయాల్లో ఇది మూడో అత్యుత్తమం. న్యూజిలాండ్పై 168 పరుగుల తేడాతో సాధించిన విజయం రన్స్ పరంగా టాప్లో ఉంది. మరోవైపు 95 పరుగుల వద్ద ఆలౌటైన సౌతాఫ్రికాకు టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు.