టీమిండియాలో బాగా రాణించిన తర్వాత కూడా కొందరి ఆటగాళ్లకు నిలకడగా అవకాశం దక్కదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యంగ్యంగా ప్రస్తావించారు. ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ను తదుపరి మ్యాచ్లో పక్కన పెడతారని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యూఏఈతో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ కేవలం 9వ ఓవర్లోనే 3 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత కుల్దీప్ యాదవ్కు'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. అయితే మ్యాచ్ అనంతరం సోనీ స్పోర్ట్స్ ఛానెల్లో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. కుల్దీప్ కెరీర్లో ఉన్న నిలకడ లేని పరిస్థితిని ఎత్తి చూపారు.

"కుల్దీప్ తర్వాతి మ్యాచ్ ఆడడు".. మంజ్రేకర్ వ్యంగ్యాస్తం
"కుల్దీప్ యాదవ్ ఇప్పుడు ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు కాబట్టి.. అతను తర్వాతి మ్యాచ్ ఆడడు. ఎందుకంటే భారత జట్టు అతన్ని ఇలానే చూస్తుంది" అని మంజ్రేకర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మాటల్లో అసహనం, బాధ రెండూ కనిపించాయి. సాధారణంగా ఒక ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేస్తే, అతనికి తర్వాతి మ్యాచ్లో కచ్చితంగా అవకాశం లభిస్తుంది. కానీ కుల్దీప్ విషయంలో ఇది రివర్స్ అవుతుందని మంజ్రేకర్ అన్నారు.
"కుల్దీప్ బాగా ఆడినప్పుడు జట్టు నుంచి తొలగించబడతాడు. ఇప్పుడు కుల్దీప్ నాలుగు వికెట్లు తీశాడు కాబట్టి, తర్వాతి మ్యాచ్ ఆడటానికి అవకాశం లేదు. నేను జస్ట్ జోక్ చేస్తున్న. కానీ టీమిండియాలో అతడి కెరీర్ చూస్తే ఇదే అర్థమవుతోంది. సత్తా ఉన్న ఆటగాడికి ఇలా జరుగుతోంది. ఇది అతని తలరాత " అని మంజ్రేకర్ వ్యాఖ్యానించడం గమనార్హం. నిజంగా ఈ వ్యాఖ్యలు కేవలం జోక్గా చెప్పినా.. కుల్దీప్ కెరీర్ను దగ్గరగా గమనించిన వారికి ఇది నిజమేననిపిస్తుంది.
కుల్దీప్ కెరీర్ ఒక కన్నీటి గాథ
మంజ్రేకర్ చెప్పినట్లుగా..కుల్దీప్ యాదవ్ కెరీర్ ఎప్పుడూ ఒక స్థిరత్వం లేకుండా సాగింది. 2017లో అరంగేట్రం చేసినప్పటి నుంచి, కుల్దీప్ జట్టులో ఉంటాడో లేదో చెప్పలేని పరిస్థితి. ఇతని గణాంకాలు చూస్తే, అతను ఎంత గొప్ప బౌలరో అర్థమవుతుంది. కేవలం 13 టెస్టులు ఆడి 22.16 సగటుతో వికెట్లు తీశాడు. వన్డేల్లో అతని సగటు 27 కంటే తక్కువ.టీ20లలో అతని గణాంకాలు సంచలనం. 13.39 సగటుతో కుల్దీప్ నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. అద్భుతమైన గణాంకాలు ఉన్నప్పటికీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ వంటి అగ్రశ్రేణి స్పిన్నర్లతో కుల్దీప్ పోటీ పడాల్సి వచ్చింది. దీనివల్ల అతనికి నిలకడగా జట్టులో చోటు దక్కలేదు.
యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారత్ కేవలం 57 పరుగులకే యూఏఈని ఆలౌట్ చేయడంలో కుల్దీప్ పాత్ర కీలకంగా నిలిచింది. కేవలం 4.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేధించింది. ఈ అద్భుత విజయంలో కుల్దీప్ ప్రదర్శన ఎంత ముఖ్యమో తెలుస్తుంది. అయినప్పటికీ, భారత జట్టులో అతని స్థానం అస్థిరంగానే ఉంది. కుల్దీప్ యాదవ్ ప్రతిభ, అంకితభావం ఉన్నప్పటికీ, అతడు "సులభంగా తొలగించబడే ఆటగాడు" అని మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి.