ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు. బంతితో పాటు బ్యాటుతోనూ రాణిస్తూ క్రమంగా ఆల్రౌండర్గా ఎదుగుతున్నాడు. బౌండరీలు, సిక్సర్ల మోత జోరుగా కొనసాగించినప్పటికీ ఉత్తమ ఢిఫెన్స్తో టీమిండియాకు బోనస్గా మారాడు. నైట్ వాచమన్గా వస్తూ ప్రధాన బ్యాటర్గా క్రీజులో నిలుస్తున్నాడు.
అయితే ఓ దశలో కుల్దీప్ వరుస గాయాలతో ఇబ్బందిపడ్డాడు. దాదాపు రెండేళ్లపాటు ఆటకు దూరమయ్యాడు. 2021 ఐపీఎల్ సీజన్లో మోకాలీ గాయం అతని కెరీర్ను దెబ్బతీసింది. శస్త్రచికిత్స చేయించుకుని కుదురుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏడాది మరో గాయమైంది. 2022లో మణికట్టులో చీలిక వచ్చింది. అయినా పట్టువదలకుండా వేగంగా కోలుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో అతడు బరువెక్కాడు. శరీరాకృతి పూర్తిగా మారిపోయింది.

ఆ సమయంలో కుల్దీప్ యాదవ్కు అప్పటి టీమిండియా హెడ్కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడని మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. కుల్దీప్ ప్రపంచ స్థాయి టెస్టు బౌలర్ అవుతాడని రవిశాస్త్రి విశ్వసించాడని పేర్కొన్నాడు. అయితే దాని కోసం కుల్దీప్ తన కొవ్వును కరిగించుకోవాలని రవిశాస్త్రి సూచించాడని ఓ జాతీయ మీడియాతో భరత్ అరుణ్ గుర్తుచేసుకున్నాడు. దాంతో శ్రమించిన కుల్దీప్ ఇప్పుడు ప్రతిఫలాన్ని పొందుతున్నాడని భరత్ వివరించాడు.
'' ఓ సందర్భంలో కుల్దీప్తో రవిశాస్త్రి ఇలా అన్నాడు. 'కుల్దీప్.. నీకు కొవ్వు ఉందని గమనించావా? దీన్ని నువ్వు ఎలాగైనా తగ్గించాలి. మెరుగైన ఫిట్నెస్తో ప్రపంచ స్థాయి టెస్టు బౌలర్గా సత్తాచాటలగవు. అలా జరగకపోవడానికి ఒక్క కారణం కూడా లేదు' అని రవిశాస్త్రి అన్నాడు. ఇప్పుడు కుల్దీప్ ఉత్తమ ఫిట్నెస్తో సత్తాచాటాడుతున్నాడు. మైదానంలో చురుకుగా కదులుతున్నాడు. అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నాడు. మరింత మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు'' అని భరత్ అరుణ్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో మూడు టెస్టుల్లోనే కుల్దీప్ చోటు దక్కించుకున్నాడు. 22.58 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు.కాగా, మరో మ్యాచ్ మిగిలుండగానే అయిదు టెస్టుల సిరీస్ను భారత్ 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.