న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు తనకు కోచ్ లేని లోటును ధోనీ తీర్చేవాడని చెప్పాడు. బౌలింగ్ సమయాల్లో తనతో పాటు సహచర స్పిన్నర్ యజువేంద్ర చహల్కు ఎన్నోసార్లు విలువైన సలహాలిచ్చేవాడని తెలిపాడు. ధోనీని తాను చాలా మిస్ అవుతున్నట్టు మణికట్టు స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి వికెట్ల వెనక ఉండే మహీ.. భారత బౌలర్లకు సూచనలు ఇస్తూ వారికి ఎంతగానో ఉపయోగపడుతాడన్న విషయం తెలిసిందే.
తాజాగా కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ... 'ధోనీ నా ఎదురుగా ఉంటే నాకు కోచ్ లేడనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతా. మ్యాచ్ ఆసాంతం ఓ కోచ్ ఎలాంటి సలహాలు, సూచనలు ఆటగాళ్లకు ఇస్తాడో.. అవన్నీ మహీ భాయ్ నాకు ఇచ్చేవాడు. ప్రతి విషయంలో నాకు అండగా ఉండేవాడు. ఎక్కువగా బంతిని గింగిరాలు తిప్పడంపైనే దృష్టి సారించమని సూచించేవాడు. మహీ వికెట్ల వెనక ఉన్నాడంటే చాలు ఒత్తిడి మొత్తం పోతుంది' అని తెలిపాడు.
'ఫీల్డింగ్ సెట్ చేసే సమయంలో ధోనీ నాకు సూచనలిచ్చేవాడు. కొన్నిసార్లు ధోనీయే మొత్తం ఫీల్డర్లను సెట్ చేసి ఏ బంతి వేయాలో కూడా ముందుగానే చెప్పేవాడు. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇలాగే చేస్తున్నా.. మహీ భాయ్ కూడా మాతో ఉంటే బాగుండు అని అనిపిస్తుంటుంది. నేను టెస్టుల్లో అరంగేట్రం చేయడానికి ఒక్కరోజు ముందు దిగ్గజ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నా దగ్గరకు వచ్చాడు. రాబోయే మ్యాచ్లో 5 వికెట్లు తీయాలని నాతో అన్నాడు. నాకు అర్థంకాక కొద్దిసేపు అలాగే నిలబడిపోయాను. తర్వాత కచ్చితంగా 5 వికెట్లు తీస్తానని చెప్పాను' అని మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ చెప్పాడు.
'కెరీర్ ఆరంభంలో పిచ్లను అధ్యయనం చేయడం నాకంతగా రాదు. ఎంఎస్ ధోనీతో కలిసి ఆడటం ఆరంభించాకే నాకీ విషయంలో అనుభవం వచ్చింది. బంతిని ఎప్పుడు స్పిన్ చేయాలో, ఎక్కడ పిచ్ చేయాలో అతడు తరుచూ చెప్తుండేవాడు. మైదానంలో ఫీల్డర్లను మోహరించడంలో ధోనీ సిద్ధహస్తుడు. అందుకే అతడు కీపింగ్ చేస్తుంటే.. నేనెప్పుడూ ఫీల్డింగ్ పొజిషన్ల గురించి పట్టించుకోను' అని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. కుల్దీప్ భారత్ తరపున 6 టెస్టులు, 60 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 167 వికెట్లు పడగొట్టాడు.
'ఆ ఒక్క కారణంగానే.. శాంసన్ కంటే పంత్కు ఎక్కువ అవకాశాలు'