
సిడ్నీ: రాత్రి వేళ స్పిన్నర్లను చదవడం కష్టమని టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. ఫ్లడ్లైట్ల వెలుతురులో స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాట్స్మెన్కు కష్టంగా ఉంటుందన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో (డే/నైట్) తనకు ఆడే అవకాశం వస్తుందనే ఆశాభావం కుల్దీప్ వ్యక్తం చేశాడు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా కంగారూల గడ్డపై ఉన్న విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్ను ముగించుకుని.. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
తాజాగా కుల్దీప్ యాదవ్ కోల్కతా నైట్ రైడర్స్.ఇన్తో మాట్లాడుతూ... 'రాత్రి వేళ స్పిన్నర్లను చదవడం కష్టమని అనుకుంటున్నా. ఎందుకంటే.. ఓ స్పిన్నర్ వైవిధ్యం ప్రదర్శిస్తే ఆ వెలుతురులో బంతి సీమ్ స్థానాన్ని గుర్తించడం అంత సులభం కాదు. మాకు అది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో స్పిన్నర్లు ఆధిపత్యం చలాయించలేరనడం అన్యాయం. ఆ పిచ్లపై స్పిన్నర్లు రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి' అని అన్నాడు.
అడిలైడ్ ఓవల్లో డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే డే/నైట్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నానని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. విదేశీ గడ్డపై ఎప్పుడూ పింక్ బాల్ మ్యాచ్ ఆడలేదని, అందుకే తాను ఆతృతగా ఉన్నానని పేర్కొన్నాడు. జట్టులో చాలా మంది రెండు నెలల పాటు టీ20 క్రికెట్ ఆడారు కాబట్టి.. టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు ఓపిక పట్టాలన్నాడు. టెస్ట్ క్రికెట్లో వికెట్లు తేలికగా రావు కాబట్టి సహనమే కీలకం కానుందని కుల్దీప్ చెప్పుకోచ్చాడు.
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు జట్టులో చోటు ఖాయమవగా.. మరో స్పిన్నర్గా కుల్దీప్ను తీసుకుంటారా? లేదా హనుమ విహారితోనే బౌలింగ్ చేయిస్తారా? అన్నది చూడాలి. కుల్దీప్ ఆడేది లేనిది ఇంకా తెలియరాలేదు. ప్రధాన పేసర్లయిన జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ గులాబి బంతితో ప్రత్యర్థి పని పట్టనున్నారు. ఇక మూడో పేసర్ స్థానంపై నవదీప్ సైనీ, ఉమేశ్ యాదవ్ ఆశతో ఉన్నారు. తొలి వార్మప్ మ్యాచ్లో ఉమేశ్ రాణించగా.. రెండో సన్నాహక మ్యాచ్లో సైనీ సత్తాచాటాడు. వీళ్లలో జట్టు మేనేజ్మెంట్ ఎవరికి ఓటు వేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.