
హైదరాబాద్: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇనిస్టాగ్రామ్ ఖాతాను హ్యాకర్లు హ్యాక్ చేశారు. అంతేకాదు కుల్దీప్ ఖాతాలో అసభ్యకర ఫోటోలను పోస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నాం కుల్దీప్ ఇనిస్టాగ్రామ్ ఖాతాను ఖాతను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఓ మహిళ అర్ధనగ్న ఇమేజిని పోస్టు చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలో తన అకౌంట్ హ్యాకింగ్కు గురైందని కుల్దీప్ తెలుసుకున్నాడు

దీంతో ఒక్కసారిగా కంగుతిన్న కుల్దీప్ ఆ ఫోటోను వెంటనే డిలీట్ చేసి అభిమానులను ట్విట్టర్ వేదికగా క్షమాపణ కోరాడు. 'నా ఇనిస్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. ఆ ఇమేజి పోస్టు చేసినందుకు గాను నేను క్షమాపణలు కోరుతున్నా. ప్రస్తుతం పాస్వర్డ్ రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నా. అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా రెండో టీ20 బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి టీ20లో కోహ్లీసేన విజయం సాధించడంతో ఈ సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఆతిథ్య సఫారీ జట్టుతో జరిగిన ఆరో వన్డేలో కుల్దీప్ యాదవ్ గాయపడటంతో అతడిని తొలి టీ20కి ఎంపిక చేయలేదు. జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా జట్టుపై కోహ్లీసేన 28 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో కూడా విజయం సాధించి సిరిస్ను కైవసం చేసుకోవాలని భారత్ ఊవిళ్లూరుతోంది.
సఫారీ పర్యటనలో కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆరు వన్డేల సిరిస్లో మొత్తం 16 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ముఖ్యంగా సఫారీ బ్యాట్స్మెన్లు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.