

హైదరాబాద్: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో తన బౌలింగ్తో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లను ముప్పతిప్పలు పెట్టిన కుల్దీప్ యాదవ్ ఆరు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
తద్వారా వన్డేల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతివాటం స్పిన్నర్గా కుల్దీప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఇంగ్లాండ్పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్గా కూడా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన కుల్దీప్ కేవలం 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.
అంతేకాదు బ్రిటీష్ పిచ్లపై వన్డేల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్గా కుల్దీప్ అరుదైన ఘనత సాధించాడు. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ చైనామన్ బౌలర్ బ్రాడ్ హాగ్ రికార్డును తిరగరాశాడు. గతంలో అనిల్ కుంబ్లే(6/12), అమిత్ మిశ్రా(6/48), మురళీ కార్తీక్(6/27)లు ఈ ఘనత సాధించారు.
ఈ ఘనతను సాధించచిన నలుగురూ బౌలర్లు స్పిన్నర్లు కావడం విశేషం. తాను వేసిన తొలి ఓవర్లోనే జాసన్ రాయ్ (38) వికెట్ తీసిన కుల్దీప్.. మరుసటి ఓవర్లో రూట్ (3), బెయిర్ స్టో (38)లను పెవిలియన్ చేర్చాడు. 11 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు కూల్చడంతో ఇంగ్లండ్ 82/3గా నిలిచింది.

చివరి పది ఓవర్లలో కుల్దీప్ మరోసారి మాయ చేశాడు. స్టోక్స్, బట్లర్ను పెవీలియన్ చేర్చాడు. కాసేపటికే డేవిడ్ విల్లే (1)ను కూడా ఔట్ చేపి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఇది కుల్దీప్ వన్డే కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కావడం మరో విశేషం. ఈ సందర్భంగా కుల్దీప్పై పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పేస్ బౌలింగ్కు అనుకూలించే పిచ్లపై స్పిన్నర్ కుల్దీప్ అద్భుతంగా రాణించాడని కామెంట్లు పెడుతున్నారు. తద్వారా భారత్ తరుపున బౌలింగ్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్గా మరో ఘనత సాధించాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన స్టువర్ట్ బిన్నీ (6-4) పేరిట ఉంది. 2014లో బంగ్లాదేశ్పై అతడు ఈ ఘనత సాధించాడు.
6-12 ప్రదర్శనతో అనిల్ కుంబ్లే ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 1993లో ఈడెన్ గార్డెన్లో వెస్టిండీస్పై కుంబ్లే ఈ ఘనత సాధించాడు. మూడో అత్యుత్తమ ప్రదర్శన ఆశిష్ నెహ్రా (6-23) పేరిట నమోదై ఉంది. 2003లో డర్బన్లో ఇంగ్లండ్పై అతడు ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్పై ఓ భారత బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇదే.