
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన భారత్, శ్రీలంక మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసినా కూడా.. తర్వాతి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం లేదని మాజీ దిగ్గజం అంటున్నాడు. రెండో వన్డేకు ముందు టీమిండియా ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు గాయం అవడంతో కుల్దీప్ యాదవ్కు జట్టులో చోటు దక్కింది. కొంత గ్యాప్ తర్వాత అవకాశం దక్కించుకున్న కుల్దీప్.. బంతితో అదరగొట్టాడు. మూడు కీలక వికెట్లు తీసుకొని శ్రీలంక పతనాన్ని శాసించాడు.
తనకు అచ్చొచ్చిన ఈడెన్ గార్డెన్స్లో కుల్దీప్ చెలరేగాడు. చివరగా భారత్ ఇక్కడ ఆడిన వన్డేలో కూడా కుల్దీప్ ఉన్నాడు. ఆ మ్యాచ్లో ఏకంగా హ్యాట్రిక్ తీసుకొని భారత్ను గెలిపించాడీ స్పిన్నర్. మళ్లీ ఇప్పుడు అవకాశం రావడంతో సత్తా చాటాడు. కానీ ఇంత గొప్పగా రాణించినా కూడా వచ్చే మ్యాచ్లో అతను ఆడటం అనుమానమే అని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. టెస్టు రీ ఎంట్రీలో కూడా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న కుల్దీప్.. వన్డేల్లో కూడా గ్యాప్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకోవడాన్ని చోప్రా ఎత్తిచూపాడు. 'కుల్దీప్ యాదవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఒక సింపుల్ రూల్ పెట్టుకున్నాడు. తనకు అవకాశం ఇస్తే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసేసుకుంటాడన్నమాట' అన్నాడు.
అయితే వచ్చే మ్యాచ్కు యుజ్వేంద్ర చాహల్ కనుక ఫిట్గా ఉంటే కుల్దీప్ను పక్కన పెట్టేస్తారని చోప్రా అభిప్రాయపడ్డాడు. 'కుల్దీప్ యాదవ్.. ఏం బౌలర్రా వీడు? స్టెల్లార్ పెర్ఫామెన్స్ చేస్తున్నాడు. తను తీసుకున్న మూడు వికెట్లలో దాసున్ షనక ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. షనక ఇప్పటి వరకు భారత బౌలర్లపై ఎదురు దాడి చేస్తూనే ఉన్నాడు. అతన్ని మన బౌలర్లు ఎవరూ అవుట్ చేయలేకపోయారు. కానీ కుల్దీప్ మాత్రం చాలా ఈజీగా అతన్ని అవుట్ చేసి గట్టి మెసేజ్ ఇచ్చాడు' అని చెప్పాడు. ఆసియా కప్లో కూడా షనకను టీమిండియా అవుట్ చేయలేకపోయిన సంగతి తెలిసిందే.